పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య
వరంగల్: పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది.
కూతురుకు పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనే ఆశ. కానీ ఆ తల్లిదండ్రులకు అంత ఇవ్వలేని నిస్సహాయత. దీంతో ఓ ప్రాణం పోయింది.
ఏకేతండా శివారు ర్యాగెట్ల తండాకు చెందిన గుగులోతు యాకూబ్ దంపతులు రోజువారీ కూలీలు. వారికి ఇద్దరు కొడుకులు. ఒక కుమార్తె. కుమార్తె శిరీష(12) వర్ధన్నపేటలోని ఎస్టీ వసతి గృహంలో ఏడో తరగతి చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. బుధవారం శిరీష పుట్టిన రోజు.
స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకునేందుకు రూ.500 ఇవ్వాలని సోమవారం తల్లిని అడిగింది. ఆమె రూ.100 ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే పురుగుమందు తాగడంతో వరంగల్లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.