వైద్యం వికటించి బాలుడు మృతి, నగ్న పూజల కోసం అదిలాబాద్ తీసుకెళ్లేవారు
వరంగల్/నల్గొండ: నల్గొండ జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రాఘవపురం గుట్ట పైన గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. దీనిని పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు.
వైద్యం వికటించి బాలుడు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి పదమూడేళ్ల బాలుడు మృతి చెందాడు. బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
నగ్నంగా పూజలు చేస్తే...
మహిళలు నగ్నంగా పూజలు చేస్తే కాసుల వర్షం కురుస్తుందని పలువురిని నమ్మించి వారిని క్షుద్ర పూజలకు తరలిస్తున్న సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాదులో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాధిత మహిళలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రసాద రావు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుల్తానా బేగం, మహబూబీ, కబీరున్నీసా అనే ముగ్గురు మహిలలు వివిధ ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలను, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలను గుర్తిస్తున్నారు.
వారిని కలిసి, క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయని నమ్మబలుకుతున్నారు. క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి.. వారిని అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఉన్న ఓ వ్యక్తి వద్దకు తీసుకు వెళ్తున్నారు. అక్కడ సదరు వ్యక్తి ఆ మహిళలకు రెండు రకాల మందులు తినిపిస్తాడు.
అనంతరం ఓ గదిలోకి తీసుకు వెళ్లి దుస్తులు విప్పించి పూజలు చేస్తాడు. పూజల అనంతరం డబ్బులు ఏవని మహిళలు అడిగితే దాడికి పాల్పడుతున్నాడు. దీంతో, తాము మోసపోయామని ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేస్తే ఏమైనా చేస్తారేమోనని మహిళలు భయపడుతున్నారు. మహబూబీ మరో ఇద్దరు మహిళలు కలిసి క్షుద్ర పూజలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం బయటకు రావడంతో ఆదివారం కాలనీవాసులు ఆ ముగ్గురు మహిళలను నిలదీశారు. వారిపై బాధిత మహిళళతో కలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు.