బోరుబావిలో పడిన చిన్నారి.. వెలికి తీసే ప్రయత్నాలు, స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి గూడ గ్రామంలో చిన్నారి వీణ(19 నెలలు) ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. పాపను వెలికితీసే సహాయక చర్యలను మంత్రి మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డి గూడ గ్రామంలో ఏడాదిన్నర వయసున్న చిన్నారి వీణ గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. పొలం వద్ద ఆడుకుంటూ ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చిన్నారి వీణను రక్షించేందుకు స్థానికులు, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బోరపల్లి గ్రామానికి చెందిన యాదయ్య, రేణుక గత సంవత్సరం బతుకుదెరువు కోసం ఇక్కారెడ్డి గూడ గ్రామానికి వచ్చారు.
భూస్వామి వద్ద పనిచేస్తూ.. పొలం వద్దే నివాసముంటున్నారు. వారి పెద్ద కుమార్తె అక్షిత, చిన్న కుమార్తె వీణ ఇద్దరూ అక్కడే ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమవ్వగా.. చిన్నారి వీణ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న బోరుబావిలో పడిపోయింది. పెద్ద కుమార్తె అక్షిత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.
సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ గురవయ్య, ఎస్సై శ్రీధర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆర్డీవో వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందగానే రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. చిన్నారి వీణను రక్షించేందుకు చేపట్టిన సహయక చర్యలను మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం చిన్నారి వీణ బోరు బావిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. జేసీబీలను అక్కడికి రప్పించి బోరు బావి చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తున్నారు. వైద్య సిబ్బంది 108 వాహనంతో లోపల ఉన్న చిన్నారికి ఆక్సిజన్ అందిస్తున్నారు.