ప్రేమ పేరుతో ఆమెను గర్భవతిని చేశాడు: శీలానికి ఖరీదు కట్టాడు
మంచిర్యాల: తల్లిదండ్రులు లేని ఓ యువతిని ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. గర్భం దాల్చడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. పంచాయతీ కోసం పెద్ద మనుషుల వద్దకు వెళ్తే ఆమె శీలానికి ఖరీదు కట్టారు.
రూ. 2.25 లక్షలు ఇప్పిస్తామని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు వారు సలహా ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు అబార్షన్ కాదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పోలీులను ఆశ్రయించింది.
ఒంటరిగా ఉంటున్న యువతి
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్కు చెందిన 22 ఏళ్ల యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. మంచిర్యాలలోని భగవంతంవాడలో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది.
ఇలా నమ్మించి మోసం
పట్నంలోని ఎడ్లవాడకు చెందిన తాపీమేస్త్రీ చౌదరి శంకర్ (25)తో ఆమెకు పరిచయం కలిగింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసువాలని ఒత్తిడి చేయడంతో గత ఐదు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
పెద్ద మనుషుల తీర్పు ఇదీ
తీవ్రంగా ఒత్తిడి పెట్టి నిలదీయడంతో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టాడు. న్యాయం చేయాల్సిన పెద్దలు శంకర్ వైపు నిలిచి యువతి శీలానికి ఖరీదు కట్టారు. రూ. 2.25 లక్షలు ఇప్పిస్తామని, అబార్షన్ చేయించుకోవాలని యువతికి సలహా ఇచ్చారు.
తీరా ఆమె ఆస్పత్రికి వెళ్తే...
తొలుత అందుకు అంగీకరించడంతో ఆమెను భయపెట్టారు. తొలుత లక్ష రూపాయలు ఇప్పించారు వాటిని తీసుకుని ఆమె అబార్షన్ చేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె అప్పటికే 8 నెలల గర్భవతి. దాంతో అబార్షన్ సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.