హిజ్రాలకు ఫ్రీగా 5కిలోల బియ్యం ఇవ్వండి, ఆ ప్రైవేటు ఆస్పత్రుల సంగతేంటి?: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. రేషన్ కార్డు లేని హిజ్రాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్లకు ఆర్థిక, వైద్య సాయంపై హైకోర్టులో విచారణ జరిగింది.
ట్రాన్స్జెండర్లకు సాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిల్ను మంగళవారం హైకోర్టు విచారించింది. పీఎం గరీబ్ యోజన కింది రేషన్ కార్డు లేని హిజ్రాలకు ఐదు కిలోల బియ్యం ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర పథకాలు వాడితే రాష్ట్రంపై భారం తగ్గుతుందని హైకోర్టు తెలిపింది.
ఇది ఇలావుండగా, కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో మరోసారి తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీకిషన్ శర్మ పిల్ దాఖలు చేశారు.
కరోనా చికిత్సలు, ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. కరోనా చికిత్సలకు ఎంత ఛార్జీ తీసుకోవాలో జీవో ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని హైకోర్టు పేర్కొంది.
జీవో ఉల్లంఘించిన ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నామని, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదే తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బిల్లు చెల్లించలేదని డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. జులై 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.