వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇవ్వండి... జగ్గారెడ్డి మనసులో మాట చెప్పాడుగా !
Recommended Video
కాంగ్రెస్ పార్టీలో సంచలనాలు సృష్టించే నేతలు బోలెడంత మంది ఉన్నారు. వారిలో ఒకరు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు అనేక వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన జగ్గారెడ్డి తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టాడు. సొంత పార్టీ నేతల పైన పలు ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ లోని నాయకులకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలోని కోవర్టుల పై అధిష్టానం దృష్టి పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అంటే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవిగానూ , వివాదాస్పదంగానూ ఉంటున్నాయి. ఇక ఈ సమయంలో ఏకంగా తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని చెప్పి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలకు రుచించటం లేదు.
ఇక అంతే కాకుండా జులై 10 నుండి సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో పని చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ మారిన వాళ్ల గురించి తాను మాట్లాడదల్చుకోలేదని పేర్కొన్న జగ్గారెడ్డి పార్టీలోనే ఉండి గోతులు తీసే వాళ్ళపైన మాత్రం అధిష్ఠానం దృష్టి సారించాలి అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంతకాలానికి జగ్గారెడ్డి తన మనసులోని మాట చెప్పి తనకు ఆ పదవి ఇవ్వాలని , అలా ఇస్తే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా అని చెప్పుకొచ్చారు. ఇక జగ్గారెడ్డి కోరికపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూడాల్సిందే.