అదృశ్యమైన నిఖిల్: ఎత్తు కోసం కాళ్లు కట్ చేసి రాడ్స్ వేసి వైద్యుల సర్జరీ
హైదరాబాద్: నగరంలోని లక్డీకపూల్లోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకం ఒకటి వెలుగు చూసింది. ఎత్తు పెంచుతామంటూ ఓ యువకుడి వద్ద లక్షల్లో వసూలు చేసిన ఘటనను తెలుగు మీడియా ఛానల్స్ ప్రసారం చేశాయి. వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని సుచిత్రా ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (22) అనే యువకుడు 5.7 ఎత్తు ఉన్నాడు.
ఇంకా ఎత్తు పెరగడానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. మూడు ఇంచులు పెరిగేందుకు కాళ్లలో రాడ్లు వేసి హైట్ పెంచుతామని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రి యజమాన్యం రూ.7 లక్షలు ఖర్చు అవుతుందంటూ అతని నుంచి రూ. 4 లక్షలు డబ్బులు తీసుకుని, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆపరేషన్ చేశారు. దీంతో నిఖిల్ రెడ్డి మూడు రోజుల క్రితం తన బంధువుతో కలిసి వచ్చి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అయితే తమ కుమారుడు మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దీంతో అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, యువకుడు గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నట్టు తేల్చారు. దీంతో తమ కుమారుడికి ఏమైందో అన్న ఆందోళనతో హుటాహుటిన గ్లోబల్ ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులకు అక్కడి వైద్యులు దిమ్మదిరిగే సమాధానం చెప్పారు.
మీ కుమారుడి రెండు కాళ్లు కత్తిరించామని, కాళ్లలో రాడ్లు వేసి అతని ఎత్తు పెంచుతామని చెప్పారు. సుమారు 7 గంటల పాటు ఈ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులకు ఆగ్రహాంతో ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు.
తమ కుమారుడి దయనీయ పరిస్థితిని చూసి నోట మాటరాలేదు. మీరు వైద్యులా పశువులా? అంటూ డబ్బుకోసం ఇంతపని చేస్తారా? అంటూ వైద్యులపై శివాలెత్తిపోయారు. చిన్న సర్జరీ చేయాలంటేనే రక్తసంబంధీకుల సంతకాలు తీసుకుంటారు.
అలాంటిది ఎవరూ లేకుండా తమ కుమారుడికి ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా నిర్వహించారని నిఖిల్ తండ్రి ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. దీనికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చెప్పిన సమాధానం వింతగా ఉంది. మైనారిటీ తీరిన వ్యక్తి ఎవరు వచ్చినా, అతని వెనుక ఎవరు లేకున్నా అతను కోరితే ఆపరేషన్ చేస్తామని వారు సమాధానం చెప్పారు.
దీంతో నిఖిల్ తండ్రికి కోపం కట్టలు తెంచుకోని వచ్చింది. చలాకీగా కళ్ల ముందు తిరిగే తమ కొడుకుకు ఆపరేషన్ చేసిందే కాకుండా ఈ విధంగా మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తన కుమారుడి రెండు కాళ్లు కట్ చేసి బెడ్పై పడి ఉండటాన్ని చూసిన నిఖిల్ తండ్రి ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆసుపత్రి వైద్యులు మాత్రం తామేమీ నేరం చేయలేదని చెబుతున్నారు. కాగా, ఆసుపత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.