ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం : గ్లోబరీనాతోపాటు మరో కంపెనీకి రీ వెరిఫికేషన్ బాధ్యతలు!
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. రీ వెరిఫికేషన్, ఫలితాల వెల్లడి ప్రక్రియ కోసం గ్లోబరీనా సంస్థతోపాటు సమాంతరంగా మరో స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి బోర్డు డిసిషన్ తీసుకుందని .. రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
మరో కంపెనీకి కూడా ..
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణం గ్లోబరీనా సంస్థ అనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఫలితాల్లో గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం వల్లే తప్పు జరిగిందని .. మరో సంస్థకు బాధ్యతలు అప్పగించాలని త్రిసభ్య కమిటీ సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడున్నర లక్షల మంది విద్యార్థుల రీ వాల్యూయేషన్ జరుగుతున్నందన .. మరోసారి తప్పిదం జరగొద్దనే ఉద్దేశంతో గ్లోబరీనా సంస్థతోపాటు మరో స్వతంత్ర్య సంస్థకు బాధ్యతలు అప్పగించాలని డిసిషన్ తీసుకుంది.
టీఎస్టీఎస్కు బాధ్యత ..
మరో ఏజెన్సీ ఎంపికచేసే బాధ్యతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు అప్పగించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. త్రిసభ్య కమిటీ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
మరో'సారీ‘ ...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు చెందిన 8 లక్షల ఆన్సర్ షీట్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల వెల్లడికి అవసరమైన సాంకేతిక ప్రాసెసింగ్ చేయాల్సి ఉంది. ఈ ప్రాసెస్ చేస్తోన్న గ్లోబరీనా మరో సారి తప్పులు జరిగే అవకాశం ఉందనే ఆదదోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి తప్పిదం జరగకుండా బోర్డు నిర్ణయం తీసుకుంది.
26మంది విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే దాదాపు 26 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పేరెంట్స్, ప్రజాసంఘాలు, విపక్షాలు .. బోర్డు, ప్రభుత్వ తీరును ఎండగట్టాయి. నిరసనలు మిన్నంటడంతో త్రిసభ్య కమిటీ వేసి .. సిఫారసునుల అమలుచేస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి తప్పిదం జరగకుండా బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది.