ఉగ్రవాదాన్ని నియంత్రిస్తే దేశాభివృద్ధి: రిటైర్డ్ మేజర్ జనరల్ కటోచ్
భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని నియంత్రిస్తే జీడీపీలో రెండంకెల వృద్ధిరేటు నమోదవుతుందని విశ్రాంత మేజర్ జనరల్ ధృవ్ కటోచ్ అన్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్ఐటీ)లోని ఎంబీఏ సెమినార్ హాల్
వరంగల్: భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని నియంత్రిస్తే జీడీపీలో రెండంకెల వృద్ధిరేటు నమోదవుతుందని విశ్రాంత మేజర్ జనరల్ ధృవ్ కటోచ్ అన్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్ఐటీ)లోని ఎంబీఏ సెమినార్ హాల్లో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఎల్ఆర్జీ రెడ్డి అధ్యక్షతన 'ప్రపంచ ఉగ్రవాదం- భారతదేశం ముందున్న సవాళ్లు' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత మేజర్ జనరల్ ధ్రువ్ కటోచ్ మాట్లాడుతూ.. భారతదేశం సగటున జీడీపీ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని చెప్పారు. దేశం బలహీనంగా ఉండటానికి ప్రధాన కారణం మూడు ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఉగ్రవాదమేనన్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదం పెంచి పోషిస్తుండటంతో స్థానికంగా ఉండే పరిస్థితుల కారణంగా ఉగ్రవాదులుగా మారుతున్నారని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతోపాటు సౌదీ అరేబియా నుంచి డబ్బు రవాణా అవుతుండటంతో నిత్యం యుద్ధం జరుగుతుందన్నారు. ఆయుధాలను అపహరించి ప్రభుత్వ బలగాలతో సమానంగా యుద్దం చేస్తున్నారని చెప్పారు.
మరో వైపు హిమాలయ దేశం నుంచి మొదలుకొని రెడ్కారిడార్ పేరిట వామపక్ష తీవ్రవాదం అంతర్గతంగా శాంతిభద్రతలను క్షీణింపజేస్తుందన్నారు. నిట్ డైరెక్టర్ ఆచార్య జీఆర్సీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వేళ్లూనుకుంటుందన్నారు. యూరఫ్లోని లండన్లో జరిగిన దాడి, కాశ్మీర్లో నిత్యం జరుగుతున్న దాడులను నియంత్రించాల్సిన అవసరముందన్నారు. అనంతరం జనరల్ కటోచ్ రాసిన 'గ్లోబల్ టెర్రరిజం' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎన్సీసీ అధికారి కల్నల్ రజనీష్కపూర్, ఆచార్య ఎల్ఆర్జీ.రెడ్డి, డీన్ ఆచార్య జయకుమార్, నిట్లోని పలు విభాగాలకు చెందిన ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.