అతి విశ్వాసానికి పోవద్దు.. కులమతాలతో పార్టీలు.. జాగ్రత్త అంటూ మంత్రి కేటీఆర్
55 ఏళ్లలో చేయని పనులను ఐదేళ్లలో చేసి చూపించామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులు కూడా చేశామని గుర్తుచేశారు. బుధవారం సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి సంబంధించిన మేనిఫెస్టోను జెడ్పీ చైర్మన్ సహా స్థానిక నేతలతోక కలిసి విడుదల చేశారు.
ఏకగ్రీవం..
సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏకగ్రీవమైన టీఆర్ఎస్ అభ్యర్థులను మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఏకగ్రీవమైన వారిని అభినందలు తెలిపిన కేటీఆర్.. వారికి శాలువా కప్పి సత్కరించారు. సిరిసిల్లాలో కనీవినీ అభివృద్ధి జరిగిందన్నారు. ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా మారిందని చెప్పారు. ఒక్కో వార్డు నుంచి ఎక్కువమంది ఆశావహులు ఉన్నారని.. టికెట్ రానీ వారు తనను అన్నగా భావించాలని కోరారు.
అవకాశం ఇస్తాం..
నాలుగేళ్లు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి.. టికెట్ రానీ వారు నిరుత్సాహ పడొద్దని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారిని తప్పకుండా గుర్తిస్తామని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్.. పనితీరు బాగోలేకుంటే తొలగించేలా కొత్త చట్టంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేస్తేనే తనకు, కేసీఆర్కు ఓటేసినట్లని కేటీఆర్ పేర్కొన్నారు. రెబల్ అభ్యర్థుల సమస్య రెండుమూడు రోజుల్లో సమసిపోతుందని కేటీఆర్ చెప్పారు.
గులాబీ గుబాళింపు
పార్టీ పేరు చెప్పి వచ్చే అభ్యర్థులు టీఆర్ఎస్ వారు కాదని కేటీఆర్ సూచించారు. సిరిసిల్లాను విద్యా కేంద్రం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. సిరిసిల్లాను ఇతరప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. మూడు మున్సిపల్స్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసిందని కేటీఆర్ గుర్తుచేశారు.
మాటలకే పరిమితం
అభ్యర్థులు అతివిశ్వాసానికి పోకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముందుకెళ్లాలని కోరారు. గడపగడపకు కనీసం ఐదుసార్లు వెళ్లి, ఓట్లు అభ్యర్థించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే కులమతాల పేరుతో ముందుకెళ్లే పార్టీలో కొన్ని ఉన్నాయని పరోక్షంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాటలకే పరిమితమైందే తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ సీటు ఆ పార్టీకి కలిసొచ్చిందే తప్ప.. నిజమైన విజయం కాదన్నారు.