ఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరు
మంచిర్యాల : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం పలువురు ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. గత నెల 15వ తేదీన విహార యాత్ర కోసం పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకులు బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గోదావరి నదిలో బోటు వెళుతున్న సమయంలో ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. కచ్చలూరు దగ్గర సుడిగుండంలో బోటు చిక్కుకోవడంతో కొందరు ప్రాణాలతో బయటపడ్డా.. చాలామంది నీట మునిగారు. ఆ క్రమంలో మంగళవారం నాడు బోటు ఆనవాళ్లు కనపడటం.. దాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో కొందరి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ డెడ్బాడీ కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సెప్టెంబర్ 15వ తేదీన బోటు ప్రమాదం.. 77 మంది ప్రయాణం
తూర్పుగోదావరి జిల్లాలో గత నెల 15వ తేదీన జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ సమయంలో బోటులో 77 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. అందులో 26 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కచ్చులూరు సమీప ప్రాంతంలో నివసించే గిరిజనులు 26 మందిని ప్రాణాలతో కాపాడారు. మరో 51 మంది మాత్రం గల్లంతయ్యారు. ఈ నెల 15వ తేదీ నాటికి 38 మృతదేహాలు బయటపడగా.. ఆ తర్వాత మరో డెడ్బాడీ కనిపించింది. మంగళవారం నాడు 8 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా నలుగురికి సంబంధించిన డెడ్బాడీలు లభ్యం కాలేదు.
హుజుర్నగర్లో ఇండిపెండెంట్ల దెబ్బ.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. నేతల గుండెల్లో గుబులు..!
ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత ఒడ్డుకు రాయల్ వశిష్ఠ
అయితే మంగళవారం (22.10.2019) నాడు గోదావరి నదిలో నుంచి ధర్మాడి సత్యం టీమ్ సభ్యులు రాయల్ వశిష్ఠ బోటును ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటకు వచ్చింది. అందులో 8 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ఒక పుర్రె కూడా కనిపించడంతో శరీరాన్ని చేపలు తిని ఉంటాయని భావిస్తున్నారు. బోటు ఒడ్డుకు చేరిన క్రమంలో అందులో బయటపడ్డ మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి కనిపించాయి. కనీసం గుర్తుపట్టే వీలు లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వారు బోటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉంటారు. ఆ క్రమంలో వారు కిటికీల దగ్గరు చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది.
బాధిత కుటుంబాల కోసం హెల్ప్ డెస్క్
మంగళవారం నాడు బోటులో నుంచి బయటపడ్డ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు వివరాలు తెలిసేలా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో బోటు బయటకు వచ్చిన సమాచారం పోస్ట్ చేశారు. మరోవైపు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మృతదేహాలను గుర్తించడానికి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. నల్గొండకు చెందిన రవీంద్రరెడ్డి కూడా ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
హుజుర్నగర్లో కారుదే జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. గెలుపు మాదే అంటున్న కేటీఆర్
మంచిర్యాల రమ్యశ్రీ డెడ్బాడీ ఎక్కడ.. కుటుంబసభ్యుల రోదన
ఈ బోటు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామానికి చెందిన రమ్యశ్రీ డెడ్బాడీ ఆచూకీ దొరకలేదు. బోటు బయటకు తీస్తున్నారనే సమాచారం అందగానే ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే 8 మృతదేహాలు బయటపడ్డా.. అందులో తమ కూతురు డెడ్బాడీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. రమ్యశ్రీ తల్లి భూమక్య, తండ్రి సుదర్శన్, సోదరుడు రఘుతో పాటు మరికొందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు కుళ్లిపోయి ఉండటంతో అందులో రమ్యశ్రీ డెడ్బాడీ గుర్తించడం కష్టతరంగా మారిందా.. లేదంటే ఇంకా నలుగురు మృతదేహాలు దొరక్కపోవడంతో అందులో ఏమైనా ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.