భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం ...మూడో ప్రమాద హెచ్చరిక దాటి .. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధం
భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది . భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి భద్రాచలం వద్ద ప్రవహిస్తోంది. ప్రస్తుతం 60 అడుగుల నీటిమట్టం భద్రాచలం వద్ద ఉంది. ఆరేళ్ల తర్వాత ఈ స్థాయిలో నీరు చేరడం ఇదే తొలిసారి.
Recommended Video
గోదావరి ఉగ్రరూపం .. సీఎం జగన్ ఆరా ..ముంపులో విలీన గ్రామాలు, ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాలు
మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి .. ఏజెన్సీ గ్రామాల్లో వరద ప్రభావం
మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉదృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు .రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 11 మీటర్లకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో, గోదావరి పరివాహక ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వరదలతో బిక్కుబిక్కుమంటున్నారు.
భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో వరద ముంపులో పలు మండలాలు
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఆందోళనకరంగా ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న పరిస్థితితో భద్రాచలం రెవెన్యూ డివిజన్ లోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం ,చర్ల మండలాలు గోదావరి వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
100 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో సుమారు 100 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంటగంటకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కేంద్ర జలసంఘం హెచ్చరికలు ... యుద్ధ ప్రాతిపదికన చర్యలు
కేంద్ర జల సంఘం కూడా గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటవచ్చని హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖాధికారులు వరదల నేపధ్యంలో గోదావరి ఉధృతిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు కేంద్రం ఆధ్వర్యంలోనూ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గతంలో 1986లో ఆగస్టు 16న గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించిందని గుర్తుచేశారు.