గోదావరి వరద.. ఎస్సారెస్పీ డేంజర్ బెల్స్ .. ములుగులో క్రుంగిన బ్రిడ్జ్ ,ఇద్దరు గల్లంతు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బీభత్సం కొనసాగుతుంది. మరోమారు వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు వద్ద ఇప్పటికే 1085 అడుగులకు నీటి మట్టం చేరింది. మరో ఆరు అడుగులకు నీటిమట్టం చేరితే ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. దీంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు సూచిస్తున్నారు.
Recommended Video
ఎస్సారెస్పీ కి భారీ వరద ..డేంజర్ బెల్స్
మరో మూడు నాలుగు రోజుల పాటు భారీగా ఎస్సారెస్పీ వరద ఉధృతి కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మరోవైపు ములుగు జిల్లాలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ములుగు నుండి జంగాలపల్లి కి వెళ్లే రహదారిపై రామప్ప వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ములుగు నుండి ఏటూరునాగారం జాతీయ రహదారిపై బైక్ మీద వెళుతూ వరద ఉధృతికి ఇద్దరు గల్లంతయ్యారు.
వరదలో యువకుల గల్లంతు .. కాపాడే యత్నం .. వర్షంలో సీతక్క
అల్లం శివాజీ, అల్లం యువరాజ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ వరద నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యువకులను కాపాడడానికి అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక మరో పక్క ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల గ్రామం వద్ద జంపన్న వాగు ఉధృతి కి వంతెన కుంగిపోయింది. అత్యంత ప్రమాదకరంగా వంతెన పరిస్థితి ఉండడంతో దానిపై ఎవరు రాకపోకలు సాగించ వద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ములుగు జిల్లాలోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపుకు గురైన గ్రామాల ప్రజలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
గోదావరిలో పెరుగుతున్న వరద .. మళ్ళీ భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక
మరోవైపు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు చిట్యాల మండల కేంద్రంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. చలి వాగు ఇంకా ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించిన సమయంలో మళ్లీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి . కురుస్తున్న వర్షాల కారణంగా మరో పక్క గోదావరిలో మళ్ళీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద బుధవారం అర్ధరాత్రి 43 అడుగులకు గోదావరి వరద తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక విరమించిన అధికారులు మళ్లీ ఈ రోజు రాత్రి కురిసిన వర్షానికి గోదావరి ఉధృతి 45.8 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఖమ్మం జిల్లాను ముంచేస్తున్న వరదలు .. రోడ్లు ధ్వంసం, నిలిచిన రాకపోకలు
వరదల కారణంగా పాల్వంచలోని నాగారం కిన్నెరసాని వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది దీంతో భద్రాచలం నుండి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కట్టు వాగు , మొట్ల వాగు , కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ మణుగూరు పట్టణాన్ని ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.