ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.!టెలిమెట్రీ ఏర్పాటు కోసం కమిటీ వేసిన బోర్డ్.!
అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాల జగడం జోరుగా సాగుతోంది. కృష్ణ నదిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో వివరాలు ఇవ్వాలని రెండు తెలుగురాష్ట్రాలకు కృష్ణ నదీజలాల యాజమాన్య బోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున గోదావరీ జలాల వాడకం, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సమావేశమయ్యరు. ఐతే తెలంగాణ అభ్యంతరాలను ఏపి వినాలని, ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను తెలంగాణ ప్రతినిధులు వినాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు.
కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలను తేల్చిన కృష్ణా బోర్డ్..!
గోదావరి నదీ జలాల వినియోగంపై ఫిర్యాదులు.. ఇరు రాష్ట్రాలు ఒకరి వాదనలు ఒకరు పరస్పరం వినాలన్న బోర్డ్ ఛైర్మన్..
దీంతో గోదావరి జలాల వినియోగంపై టెలిమెట్రీ ఏర్పాటు కోసం బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు. తెలంగాణ తరుపున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు.
టెలిమెట్రీ ఏర్పాటు కోసం కమిటీ.. ఏర్పాటు పై అమోదయోగ్యమైన నిర్ణయం చేయనున్న కమిటీ..
ఇదిలా ఉండగా గతంలో గోదావరి జలాల్లోంచి 967.14 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు రజత్ కుమార్. ఈ జలాలను వాడుకోవడంలో అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్పిందన్నారు రజత్ కుమార్. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన జలాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుందన్నారు. ఇప్పటికే కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డులు పదేపదే కోరుతున్నాయని అన్నారు.
కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు.. గోదావరి బోర్డ్ కు స్పష్టం చేసిన రజత్ కుమార్
కాగా ప్రాజెక్టు నిర్మాణ వివరాలను ప్రభుత్వ అనుమతితో ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, అందుకు కొంత సమయం పడుతదుందని రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టలేదన్న రజత్ కుమార్, కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీరు తరలిస్తున్నందున మాకు 45 టీఎంసీలు అదనంగా తెలంగాణకు అందివ్వాలని బోర్డును కోరామని రజత్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో నిబంధనలకు లోబడే ప్రాజెక్టులు.. వివరణ ఇచ్చిన తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి..
పోతిరెడ్డిపాడుపై లిఖిత పూర్వకంగా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వాదనలను వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు పూర్తి కానందున, రైతులకు న్యాయం జరగనందునే తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు కోసమే సాగిందన్నారు రజత్ కుమార్. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, అన్నీ కూడా నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు.