స్టూడెంట్స్ "గలీజు" దందా.. చదువుకుంటూనే పాడు పని..!
పెద్దపల్లి : కొందరు విద్యార్థులు దారి తప్పుతున్నారు. చదువుకుంటూ వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. చెడుదారిలో పయనిస్తూ అందమైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ముగ్గురు యువకులు అడ్డదారి తొక్కిన వైనం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు గలీజు దందా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ముగ్గురు దోస్తులు కలిసి చేస్తున్న గలీజు దందా బయటకు రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. చదువుకుంటూ సన్మార్గంలో నడవాల్సిన విద్యార్థులు దారి తప్పుతూ ఇలా అనైతిక పనులకు పాల్పడుతుండటం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
దారి తప్పిన విద్యార్థులు..!
గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు ముఠాగా ఏర్పడ్డారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న యువకుడు ఒకరు.. ఇంటర్ పూర్తైన మరో యువకుడు.. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్న ఇంకో అతను ముగ్గురు కలిసి గ"మ్మత్తు" దందా చేస్తున్నారు. చివరకు పెద్దపల్లి పోలీసుల వలకు చిక్కడంతో గుట్టు రట్టైంది. వీరి వింత దందా చూసి పోలీసులే నివ్వెరపోయిన పరిస్థితి. ఆ ముగ్గురిలో ఒకరు మైనర్ కావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.
19 సంవత్సరాల కొండం ప్రదీప్ రెడ్డి, బత్తుల శివకుమార్తో మరో మైనర్ బాలుడు కలిసి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో గలీజు దందా చేస్తూ తోటి స్నేహితులకు గంజాయి సప్లై చేస్తున్నారు. ఆ క్రమంలో బండారం బయటపడి పెద్దపల్లి పోలీసులకు చిక్కారు. ఆ మేరకు డీసీపీ సుదర్శన్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
లంచం, లంచం, లంచం.. గవర్నమెంట్ స్కూల్లో "టీసీ" ఇవ్వడానికి కూడా లంచమేనా?
గంజాయి దందా.. చివరకు దొరికారు ఇలా..!
విద్యార్థుల ముసుగులో ఈ ముగ్గురు కలిసి చాలా రోజుల నుంచి గంజాయి దందా చేస్తున్నా.. ఇంతవరకు బయటపడలేదు. స్టూడెంట్స్ కావడంతో వీరిపై ఎవరికీ కూడా పెద్దగా అనుమానం రాలేదు. అదే ఆసరాగా తీసుకుని గంజాయి సప్లై చేస్తూ రెచ్చిపోయారు. అయితే ఇటీవల వీరి గురించి కొంత సమాచారం పోలీసుల దృష్టికి వచ్చింది.
ఆ క్రమంలో పెద్దపల్లి ఎస్సై ఉపేందర్ రావు చొరవతో ఈ ముగ్గురి బాగోతం బయటపడింది. గురువారం నాడు పెద్దకల్వల స్టేజీ దగ్గర నిఘా వేసి వీరిని పట్టుకుని సోదా చేయగా మూడు పాలిథిన్ కవర్లలో దాదాపు 750 గ్రాముల గంజాయి పట్టుబడింది. దాంతో కొంతకాలంగా వారు చేస్తున్న ఈ గలీజు దందా గుట్టురట్టైంది. అయితే వీరు గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల్లో ఎవరెవరెకి గంజాయి అమ్మారు.. అసలు వీరికి ఎవరు సప్లై చేస్తున్నారు తదితర వివరాలు రాబడుతున్నారు.
తల్లిదండ్రులు జరభద్రం..!
ఈ సందర్భంగా డీసీపీ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయ్యే నిందితులకు దాదాపు ఇరవై ఏళ్లు జైలుశిక్ష విధించే అవకాశాలున్నాయని తెలిపారు. గంజాయి అమ్ముతూ పట్టుబడితే వారిపై పీడీ యాక్టు కూడా నమోదు చేస్తామని చెప్పారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో దారి తప్పుతున్న యువత సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే పిల్లల్ని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వెల్లడించారు డీసీపీ. కాలేజీలంటూ వెళుతున్న తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టుకు ఉండాలని సూచించారు. స్వేచ్ఛ ఇవ్వడం వరకు ఓకే.. కానీ అదీ మితిమీరితేనే ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిపారు. సో భద్రం బీకేర్ఫుల్ పేరేంట్స్.