Medaram : మొదలైన కీలక ఘట్టం.. గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ..
Recommended Video
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ తల్లి బుధవారం రాత్రి గద్దెకు చేరింది. డోలి వాయిద్యాలు,డప్పు చప్పుళ్ల నడుమ కన్నెపల్లి నుంచి గిరిజన సాంప్రదాయ పద్దతిలో తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజు, సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెలపై ఆసీనులయ్యారు. కన్నెపల్లి నుంచి సారక్కను ఊరేగింపు తీసుకురాగా.. గోవిందరాజులును కొండాయి నుంచి,పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించారు.
ఇక గురువారం సాయంత్రం వేళ మహా తల్లి సమ్మక్క గద్దెలకు చేరనుంది. గురువారం తెల్లవారుజామున రెండు, మూడు గంటల ప్రాంతంలో తలపతి, వడ్డె, బోయిలతోపాటు మరికొందరు కులపెద్దలు కంకవనం తెచ్చేందుకు వెళ్తారు. అక్కడే తలస్నానం చేసి ఆచారం ప్రకారం బోనం వండుతారు. అనంతరం సమ్మక్కతల్లి వేంచేసి ఉన్న కంక వనాన్ని గుర్తించి.. దాన్ని పెకిలిస్తారు. గిరిజన పూజా సంప్రాదాయం ప్రకారం తల్లికి అక్కడ కొన్ని పూజలు జరుపుతారు. అనంతరం డప్పు చప్పుళ్లతో కంక వనంలో సమ్మక్కను తీసుకుని మేడారం గద్దెలకు ఊరేగింపుగా బయలుదేరుతారు.
రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరను కోటి మంది వరకు దర్శించుకుంటారు. ఈ ఏడాది భక్తుల తాకిడి మరింత పెరగడంతో... ఆ సంఖ్య మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక జాతరకు ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వైరా ఎమ్మెల్యే రాములు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ కుమార్తెలు కూడా తల్లులను దర్శించుకున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం మేడారం వెళ్లి వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మేడారం భక్త జన సంద్రంతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంతో సమ్మక్క సారలమ్మ జయజయధ్వానాలతో మారుమోగిపోతోంది. చుట్టూ ఎటూ చేసిన కి.మీ మేర గుడారాలే కనిపిస్తున్నాయి. భక్తుల తలనీలాలు తీసేందుకు సైతం కూర్చునే చోటు లేక.. నిలబెట్టే తలనీలాలు తీస్తున్నారు.