వేసవి సెలవులకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఈస్టర్ పండుగ తో పాటు , వేసవి సెలవులు గడపాలని ఎంతో ఆశతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరిన చిన్నారులను మృత్యువు కబళించింది. విధి కాటేసింది. ఎదురుగా వస్తున్న కారు బైక్ పై వెళుతున్న నలుగురి పాలిట మృత్యు శకటం అయింది. వరంగల్ రూరల్ జిల్లా కొమ్మాల వద్ద చోటుచేసుకున్న దారుణ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.
మితిమీరిన వేగంతో బైక్ ను డీకొట్టిన కారు .. నలుగురు మృతి
చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సింగారపు అనిల్ వరంగల్ లోని చింతల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న అనిల్ తన ఇద్దరు కవల కుమార్తెలు అయిన జాహ్నవి, జాస్మిన్ లను, తమ సోదరి కుమార్తె అయిన సాత్విక ను తీసుకుని జల్లి లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు. ద్విచక్ర వాహనంపై జల్లి కి బయలుదేరిన అనిల్ బైక్ ను కొమ్మాల వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. 50 మీటర్ల వరకు వాహనాన్ని కారు లాక్కెళ్ళింది. దీంతో అనిల్, జాహ్నవి, సాత్విక లు అక్కడికక్కడే మృతి చెందారు. జాస్మిన్ కు తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎం కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈస్టర్ పండుగ నాడు విషాదం .. వేసవి సెలవులకు వెళ్తూ మృత్యువాత
దీంతో ఈస్టర్ పండుగ నాడు మృతుని కుటుంబానికి విషాద ఛాయలు అలముకున్నాయి .కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.సింగారపు అనిల్ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. అనిల్ తో పాటు అతని ఇద్దరు పిల్లలు జాహ్నవి, జాస్మిన్ మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనిల్ భార్య ఆరు నెలల గర్భవతి కావడం, అనిల్ తన ఇద్దరు పిల్లలతో సహా తిరిగిరాని లోకాలకు చేరిపోవడం అందరి మనసును కలచివేసింది.
మద్యం మత్తులో మితిమీరిన వేగంతో నడిపిన కారు డ్రైవర్ .. ఘటన తరువాత పరారీ
మద్యం మత్తులో కారు డ్రైవర్ అతివేగంగా కారు నడుపుతూ బైక్ ను ఢీ కొట్టినట్టు సాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. సంఘటన జరిగిన వెంటనే సమీపంలోని వారు పరిగెత్తుకు వచ్చి కారు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు దాడి చేసి తప్పించుకు పోయినట్లుగా స్థానికులు తెలిపారు. నలుగురు మృత్యువాత పడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.