నడిరోడ్డుపై ఓ మహిళ ఇచ్చిన షాక్కు దిమ్మతిరిగింది.. కారు ఆపి మరీ!..
కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై ఉన్న ఏఎస్ రాజు కాలనీ కమాన్ వద్దకు రాగానే ఒక మహిళ తారసపడింది. తన కారు పంక్చర్ అయిందని, సహాయం చేయాలని కోరింది.
కూకట్పల్లి: ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా సహాయం కోరితే.. ఎవరైనా సరే సహాయం చేయడానికి వెనుకాడరు. మంచి చేయాలని వెళ్తే చెడు ఎదురయ్యే సంఘటనలు కూడా ఉంటాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహిళ చేతిలో మోసపోయిన అభిషేక్ షాక్కు గురయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ అగర్వాల్ అనే వ్యాపారి ఆదివారం రాత్రి చందానగర్ నుంచి బషీర్ బాగ్ కు మూడున్నర కిలోల బంగారు నగలు తీసుకుని కారులో బయలుదేరాడు. కూకట్పల్లి మెయిన్ రోడ్డుపై ఉన్న ఏఎస్ రాజు కాలనీ కమాన్ వద్దకు రాగానే ఒక మహిళ తారసపడింది. తన కారు పంక్చర్ అయిందని, సహాయం చేయాలని కోరింది.
దీంతో నిజమేననుకున్న అభిషేక్ సమస్యేంటో చూద్దామని కారు నుంచి కిందకు దిగాడు. అంతే, అతను కారు నుంచి కిందకు దిగాడో లేదో.. కారులో ఉన్న బంగారం బ్యాగు అందుకుని సదరు మహిళ ఉడాయించింది.
అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తు మొదలైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం సీసీటీవి ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరికి గురైన బంగారం విలువ రూ.1కోటి వరకు ఉండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు.