తెలుగు సీరియల్స్ లో లాగా...కోడలు నగలుదోచి దాచేసిన అత్త
తెలుగు సీరియల్స్ ను మరిపించే ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది. కోడలు తనను గౌరవించడం లేదనే అక్కసుతో కోడలు బంగారు ఆభరణాలను దాచిపెట్టి దొంగలు దోచుకొన్నారని నాటకమాడింది ఓ అత్త.
హైదరాబాద్:తనంటే కోడలికి గౌరవం లేదనే అక్కసు పెంచుకొంది ఓ అత్త. కోడలు ఇబ్బంది పడుతోంటే చూడాలని భావించింది. తెలుగు సీరియల్స్ లో తరహలో ఘటనను మరిపించే ఘటన ఒకటి హైద్రాబాద్ లో చోటుచేసుకొంది. తన కోడలు బంగారు ఆభరణాలను దాచిపెట్టి దోపిడి జరిగిందని ఓ అత్త ఆడిన నాటకాన్ని పోలీసులు బయటపెట్టారు.
హైద్రాబాద్ లోని చందానగర్ లో అత్త ఆడిన నాటకాన్ని పోలీసులు చేధించారు.తన కోడలు తనను ఏనాడు ఆప్యాయంగా పలకరించదు, గౌరవించదనే కోపం అత్తకు ఉంది. దీంతో కోడలిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది అత్త.దీనికి ఓ పథకాన్ని రచించింది. తెలుగు సీరియల్స్ తరహలోనే అత్త వ్యవహరించింది.
చందానగర్ శంకర్ నగర్ ప్రాంతంలోథశరథ్ బిహెచ్ ఈ ఎల్ పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య ద్రౌపది , కొడుకు నాగరాజు, కోడలు శ్వేత ఉన్నారు. వీరంతా కలిసి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు.థశరథ్ కొడుకు భార్య తనను అసలు గౌరవించడం లేదనె అక్కసు ద్రౌపదికి ఉంది.
నాగరాజుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో భార్యభర్తలిద్దరూ ఆసుపత్రికి వెళ్ళారు. ధశరథ్ మీ సేవా కేంద్రానికి వెళ్లాడు.అదే తనకు అనుకూలమైన సమయంగా ద్రౌపది భావించింది.
బీరువాలోని కోడలు నగలను ఆమె తీసి దాచిపెట్టింది. మీ సేవ నుండి భర్త ఇంటికి రాగానే ఇద్దరు దొంగలు వచ్చి తనను బెదిరించి బీరువాలోని నగలను దోచుకెళ్ళారని ద్రౌపది చెప్పింది.దీంతో భార్య, భర్తలు లింగంపల్లి స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు థశరథ్ ఇంటిని పరిశీలించారు. స్కూటర్ పై ఇద్దరు హెల్మెట్లు పెట్టుకొని వచ్చి తనను బెదిరించి బీరువాలోని నగలను దోచుకెళ్ళారని ద్రౌపది పోలీసులకు చెప్పింది.
అయితే ద్రౌపది చెప్పిన సమయంలో ఆ ప్రాంతంలో ఎలాంటి బైక్ లు రాలేదు. అంతే కాదు హెల్మెట్లు పెట్టుకొన్న వ్యక్తులు కూడ ఆ ప్రాంతంలో సంచారం లేదని సిసి కెమెరాల పుటేజీ ఆధారంగా పోలీసులు తెలుసుకొన్నారు.
దొంగతనానికి వచ్చిన దొంగలు ద్రౌపది చెవి ఆభరణాలను ఎందుకు తీసుకెళ్ళలేదనే కోణంలో పోలీసులు ఆలోచించారు. ఇదే విషయమై వారు ద్రౌపదిని ప్రశ్నించారు.అయితే ద్రౌపది నీళ్ళు నమిలింది.
దశరథ్ కూడ భార్య తీరుపై అనుమానం వచ్చి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది.కోడలు శ్వేత తనను గౌరవించడం లేదనే కోపంతోనే తాను బంగారు ఆభరణాలను దాచి దోపిడి జరిగిందనే నాటకం ఆడానని ద్రౌపది చెప్పింది. ద్రౌపది నుండి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.