నడుముకు బంగారం బిస్కెట్లు చుట్టుకొచ్చి దొరికిపోయిన మహిళ: 4.5కేజీల గోల్డ్ సీజ్
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గురువారం ఉదయం ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేసి.. ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. బ్యాంకాక్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన మహిళను తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు సోదా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికురాలి నడుముకు బంగారపు బిస్కెట్లు చుట్టుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో బంగారపు బిస్కెట్లు స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బంగారం 4.5 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మహిళ పేరు సుశీల అని, ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కడప అని చెప్పారు.
గొలుసు వదిలి పరారైన చైన్ స్నాచర్
హైదరాబాద్ నగరంలోని మీర్పేట ఆర్ఎన్ రెడ్డి నగర్లో గురువారం చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. బాధితురాలు అనిత(30) పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. స్కూల్లో పిల్లల్ని దింపి ఇంటి తిరిగి నడిచి వెళ్తున్న అనితపై చైన్ స్నాచర్ దాడి చేసి.. మెడలో గొలుసు లాక్కున్నారు. పరారవుతున్న క్రమంలో కిందపడ్డాడు.
ఇంతలో తెరుకున్న అనిత బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. కాగా, చైన్ స్నాచర్ గొలుసు వదిలి కొద్దిదూరంలో బైక్పై వెయిట్ చేస్తున్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. స్థానికులు బైక్పై వెంబడించినా.. చైన్ స్నాచర్లు మాత్రం దొరకలేదు.