కోయంబత్తూర్ - హైదరాబాద్ బస్సులో 4 కిలోల బంగారం చోరీ
మహబూబ్ నగర్: బస్సులో మరోసారి దొంగతనం జరిగింది. మూడు రోజుల క్రితం కేశినేని ట్రావెల్స్ బస్సులో 7 కిలోల బంగారం అధృశ్యమైన సంఘటన మరవకముందే మరోసారి దొంగతనం జరిగింది. కోయంబత్తూర్ నుంచి హైదరాబాదుకు వస్తున్న బస్సులో భారీ చోరీ జరిగింది.
నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కోయంబత్తూరులోని మహావీర్ జ్యువెల్లర్స్ నుంచి హైదరాబాదులోని కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారికి చూపించేందుకు సుమారు 15 కిలోల నికర తూకం గల మూడు బంగారు ఆభరణాల ప్యాకెట్లతో సుజారం, లోకనాథన్లు శుక్రవారం రాత్రి కోయంబత్తూరులో బస్సెక్కారు.
వారు శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు బస్సును ఎక్కారు. మధ్యలో ఓసారిసేలం వద్ద బస్సును ఆపారు. ఆ తర్వాత శనివారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఓ దాబా వద్ద బస్సు ఆపారు.
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన లోకనాథన్ చాలాసేపటి వరకు రాకపోవడంతో సుజారాం కూడా బస్సును దిగాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు బస్సులో చొరబడి బంగారు ఆభరణాలతో ఉన్న ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. రెండు ప్యాకెట్లు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.