యాదాద్రిలో గోల్డ్ మాన్..! ఒళ్లంతా బంగారంతో దైవదర్శనం..!!
యాదాద్రి/హైదారాబాద్ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అనే నానుడి ఇప్పటివరకు వినడమే గాని చూసిన సందర్బాలు అరుదుగా ఉంటాయి. ఎవరైనా చిత్ర విచిత్రంగా, కనిపించడమే కాకుండా కాస్త హడావిడిగా కనిపిస్తే వెంటనే పుర్రెకో బుద్ది అనే డైలాడ్ లు బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంటాయా. అచ్చం ఇలాంటి సంఘటనే యాదాద్రి పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది. అతడు హైదరాబాద్ వాసి. వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. తాతలు సంపాదించిన భూములకు మంచి గిరాకి రావడంతో అతగాడి పని తంతే బంగారం బుట్టలో పడ్డట్టైంది. ఎంత పెద్ద భూదందాలు నిర్వహిస్తున్నప్పటికి అతడికి మూడు బలహీనతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి ఒంటి నిండా బంగారం వేసుకోవడం, రెండోది దైవ దర్శనాలు, మూడోది కనిపించిన ప్రతిచోట, ప్రతిసారి సింగిల్ టీ తాగడం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే మనోడికి తెగ పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి, భయం కూడా. ఆ రెండింటి తర్వాత చేతిలో టీ గ్లాసు ఉండాల్సిందే..!
చేతులకు పురాతన రాజులు ధరించే పెద్ద పెద్ద వంకీలు, వేళ్లకు వెసులుబాటు లేనంతగా ఆల్చిప్పల్లాంటి ఉంగరాలు, ఇక మెడలో కుక్కను కట్టేసే చైన్ మాదిరి గొలుసులతో యాదాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా స్థానిక మిత్రులకు సమాచారం అందించి యాదాద్రి దర్శనానికి వచ్చాడు. అంతే మనోడికి ఆలయ అర్చకులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రియల్ వ్యాపారి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. ఆ వెంటనే ఆలయం బయటకు రాగానే సోమాలియా ఆకలి బాదితుల మాదిరి పక్కనే ఉన్న చాయ్ దుకాణంలో సింగిల్ టీ తాగడం గురించి అక్కడకు చేరుకున్న వారు వింతగా మాట్లాడుకోవడం కొసమెరుపు. మరి బంగార్రాజా..! మజాకా..!