విద్యుత్తు కొనుగోళ్లలో గోల్ మాల్..!వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న బీజేపి..!!
హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం గోల్ మాల్ లకు పాల్పడుతోందని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోందని బీజేపి అద్యక్షుడు కే.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వం పైకి ఒకటి చెప్తుంటే లోపల మరొకటి జరుగతోందని మండిపడ్డారు. కొత్త చట్టం ప్రకారం పంచాయతీలు విద్యుత్తు బిల్లులు కట్టకపోతే సర్పంచ్ను తొలగిస్తామని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే స్పష్టం చేసారని, ఇప్పుడు అనేక విద్యుత్ సంస్థలకు తెలంగాణ సర్కార్ బకాయిపడినందున ప్రజలు మీకు కట్టబెట్టిన పదవిని తొలగించాలా అని సూటిగా ప్రశ్నించారు. బకాయిలు కట్టి విద్యుత్తు తీసుకోమంటున్న ప్రభుత్వానికి ఒక నీతి, సర్పంచులకు మరో నీతా అని నిలదీసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
అధిక ధరతో సౌర విద్యుత్తు కొనుగోలు..!తక్కువకు కేంద్రం ఇస్తామన్నా తిరస్కరణ..!!
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యూనిట్ సౌర విద్యుత్తు 4.30 రూపాయలకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం, కమీషన్లు రావన్న ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టిందని విమర్శించారు. మరోవైపు రాత్రికి రాత్రి 5.50 రూపాయలతో యూనిట్ విద్యుత్తు కొనుగోలుకు ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యుత్తు కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఇండియా బుల్స్ అనే సంస్థ వదిలేస్తున్న కాలం చెల్లిన సబ్-క్రిటికల్ పవర్ ప్లాంట్ను ఎందుకు కొంటున్నారన్న ప్రశ్నకు జవాబు లేదన్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తి..! ఇండియా బుల్స్తో ఒప్పందం చట్ట వ్యతిరేకమన్న బీజేపి..!!
2015లో ఇండియా బుల్స్తో ఒప్పందం చేసుకున్నా, ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఈ ప్లాంట్ను ప్రారంభించినా ప్రభుత్వానికి గుదిబండగా మారడం ఖాయమన్నారు. చిత్తశుద్ధి ఉంటే విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు 20వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయాయని మండిపడ్డారు. 'కొత్త చట్టం ప్రకారం పంచాయతీలు విద్యుత్తు బిల్లులు కట్టకపోతే సర్పంచ్ను తొలగిస్తామంటున్నారు. అనేక విద్యుత్ సంస్థలకు మీరు బకాయిపడినందున ప్రజలు మీ పదవిని పీకేయాలా? మీకో నీతి, సర్పంచులకో నీతా? అందరికీ భారత రాజ్యాంగం వర్తిస్తే, మీకు కల్వకుంట్ల రాజ్యాంగమా? అని లక్ష్మణ్ మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి..! కేసీఆర్కు సీఎంగా ఉండే అర్హత లేదన్న లక్ష్మణ్..!!
విద్యుత్తు సంస్థలకు సంబంధించిన 10 వేల కోట్ల రూపాయలు బకాయిలు కట్టలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకాలకు 5వేల కోట్ల కరూపాయలు, ఛత్తీస్గఢ్కు 1800 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ప్రధాని మోదీ కృషి కారణంగానే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మిగులు విద్యుత్తుతో కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రజలు అమాయకులు కాదు..! వాస్తవాలు చెప్పాలన్న బీజేపి నేతలు..!!
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇతరులపై నెపం వేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోదీకి ఎక్కడ పేరొస్తుందోనన్న భయంతో తెలంగాణలో కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ధ్వజమెత్తారు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 150 ఎకరాలు ఇవ్వకపోవడం వల్లే తరలిపోతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో స్పష్టత కొరవడిందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల అంశంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేసారు బీజేపి నేతలు.