తెలంగాణకు మంచి రోజులు, పరిశ్రమలే పరిశ్రమలు ఇలా: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తెలంగాణకు మంచి రోజులు వచ్చాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మెదక్ జిల్లాలో రూ.17 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగల జాతీయ పెట్టుబడుల, ఉత్పత్తి జోన్ (నిమ్జ్), రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రూ.45 వేల కోట్ల మేర పెట్టుబడుల్ని ఆకర్షించగల హైదరాబాద్ ఫార్మా నిమ్జ్ వస్తున్నట్లు తెలిపారు.
అలాగే మెదక్ జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ధాన్యం ప్రాసెసింగ్ క్లస్టర్, హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఐటీ, ఐటీఈఎస్ సెజ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. నిమ్జ్ల ద్వారానే 4.86 లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
శుక్రవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే నిమ్జ్ ప్రత్యక్షంగా 1.11 లక్షల మందికి, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని, ఏటా రూ.60 వేల కోట్ల వ్యాపారం చేయగలదని వివరించారు.
ఇందులో ఇంజనీరింగ్, రక్షణ, విమానయాన, ఫార్మాస్యూటికల్స్, జౌళి, బట్టలు, ఎలకా్ట్రనిక్స్, టెలికామ్ హార్డ్వేర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతాయని చెప్పారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంటే సాఫ్ట్వేర్కే ప్రసిద్ధి చెందిందని, ఈ నిమ్జ్తో హార్డ్వేర్కు కూడా స్థానం లభిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. నిమ్జ్ ఏర్పాటుకు తుది అనుమతులు బుధవారమే ఇచ్చామని, 2020 నాటికి తొలిదశ నిమ్జ్ పూర్తికి గడువు విధించామని తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉన్నాయని, ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో హైదరాబాద్ ఫార్మా నిమ్జ్ పేరిట ఏర్పాటు చేయబోయే జోన్ ద్వారా ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా లభిస్తాయన్నారు.
ఫార్మా పరిశ్రమ మరింతగా విస్తరిస్తుందని, ఫార్మా నిమ్జ్కు గురువారం సూత్రప్రాయ అనుమతి ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సవరించిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల మెరుగుదల పథకం(ఎంఐయూఎస్) కింద ధాన్యం ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటవుతుందని, దీనికి నిరుడు ఆగస్టులో అనుమతి ఇచ్చామని చెప్పారు.
మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యూలాబ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ, జీఏఆర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లు ఈ సెజ్లను ఏర్పాటు చేస్తాయన్నారు. చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్ తరహాలో నిమ్జ్ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి వివరించారు. వీటికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు.
నిమ్జ్ ఏర్పాటయ్యే ప్రాంతాన్ని రైల్వే, రోడ్డు, విమానాశ్రయం, సముద్రయానాలకు అనుసంధానిస్తామన్నారు. జహీరాబాద్ రైల్వేస్టేషన్కు రైల్వేలైన్, విశాఖపట్నం, చెన్నై, ముంబై నౌకాశ్రయాలకు, బీదర్ విమానాశ్రయానికి రోడ్డు మార్గం నిర్మిస్తామన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒకేచోట లభిస్తుండటం వల్ల పెట్టుబడులు అధికంగా వస్తాయన్నారు. నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటుపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.