హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్ .. నిరుపేదల మెరుగైన వైద్య సేవలకు సర్కార్ మరో నిర్ణయం
భాగ్యనగర వాసులకు తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. స్లమ్ ఏరియాల్లో బస్తీ దవాఖానాలను గణనీయంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించటానికి సర్కార్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు.
Recommended Video
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలకు తెలంగాణా సర్కార్ నిర్ణయం
తెలంగాణా రాజధాని నగరం భాగ్యనగరం . నిత్యం రద్దీతో సతమతమయ్యే హైదరాబాద్ నగరంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నిరుపేదలు, రోజు వారీ కూలీ పనులు చేసుకునే వారికి వైద్యం భారంగా మారుతుంది. ఇక ఈ నేపధ్యంలో వారి ఆరోగ్య రక్షణకు, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించటానికి తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ తనయుడు పురపాలక మరియు ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు .
కొత్తగా 227 దవాఖానాలకు ఏర్పాటు చేయడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
జీహెచ్ఎంసీ పరిధిలో పేదవారి కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న దవాఖానాల సంఖ్యను అతి త్వరలోనే పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయని మరో 227 దవాఖానాలకు ఏర్పాటు చేయడానికి సీఎం కార్యాలయం నిర్ణయం తీసుకుందని , నిధులు కూడా మంజూరు చేసిందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలోనే మరిన్ని ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు
వచ్చే 3 నెలల్లో 150 వార్డుల్లో మొత్తం 350 బస్తీ దవాఖానాలు
గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 123 దవాఖానాలు సరిపోవటం లేదని గుర్తించే వాటికి తోడు మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు . దీనితో వచ్చే 3 నెలల్లో 150 వార్డుల్లో మొత్తం 350 బస్తీ దవాఖానాలు నిరుపేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. పేదవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ వార్త నగరంలోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న వారికి నిజంగా గుడ్ న్యూసే .