పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు
నిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ చేసి పసుపు రైతులు తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేశారు. ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని కేంద్రం చెప్తుంది.
ఇక నేడు పార్లమెంట్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డును రీజినల్ కార్యాలయంగా హోదా కల్పిస్తూ ప్రకటన చేసిన మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్లో ఎక్స్టెన్షన్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.మిర్చి, పసుపు, సుగంధ ద్రవ్యాల అమ్మకాలు, కొనుగోలుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు నాణ్యత, దిగుబడి పెంచే విషయంపై బోర్డు పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు సహకరిస్తుందని రైతులకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందని ఆయన చెప్పారు . ఇక ఈ ఆఫీసును డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. అంతేకాదు తక్షణమే బోర్డు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. నిజామాబాద్ రైతుల కోరిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను తాము కల్పించామని పీయూష్ గోయల్ తెలిపారు.