పోలీసులకు ఇకపై గోల్డెన్ డేస్.. 8 గంటలే డ్యూటీ..!
హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే వారికి కాసింత విరామం ఇవ్వాలని భావిస్తోంది. అందులోభాగంగా షిఫ్టుల విధానం తెరపైకి తేవాలని యోచిస్తోంది.
పోలీస్ డ్యూటీ అంటే 24 గంటల పని సమయం. షిఫ్టులవారీగా పనిచేసే అవకాశముండదు. ఇలాంటి నేపథ్యంలో విరామం లేకుండా పనిచేస్తున్న పోలీసులు అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాదు ప్రజలకు సేవలందించడంలో వెనుకబడుతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం బయటపడింది. అందుకే పోలీస్ శాఖలో షిఫ్టుల విధానం తెరపైకి రానుంది.
సర్వే ఏం చెప్పిందంటే..!
పోలీసుల పనితీరుపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కీలకాంశాలు వెలుగుచూశాయి. బీపీఆర్డీ, ఆస్కీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పోలీసులు విరామం లేకుండా పనిచేస్తున్న విధానం.. వారి పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తోందనే విషయం బయటపడింది. 23 రాష్ట్రాల్లోని 319 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. మొత్తంగా 9 రకాల పోలీస్ స్టేషన్లను శాంపిల్ గా తీసుకుని అధ్యయనం చేశారు. 8గంటల షిఫ్ట్ విధానం అమలుకై సాధ్యాసాధ్యాలను కూడా లెక్కించారు. విశ్రాంతి లేకుండా కంటిన్యూయస్ గా డ్యూటీలో ఉండటంతో పోలీసుల పనితీరు మందగిస్తోందనేది సర్వే సారాంశం. 24 గంటల డ్యూటీతో మంచి ఫలితాల మాటేమో గానీ దుష్ఫలితాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.
24 గంటలు కష్టం.. 8 గంటలతో లాభం
నేరాల సంఖ్య అంతగా లేని సమయంలో పోలీసుల సంఖ్య తక్కువైనా ఇబ్బంది కాలేదు. రోజురోజుకీ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. పనిభారం పెరగడంతో పోలీసులు అనారోగ్యం పాలవుతున్నారనే విషయం సర్వేలో బయటపడింది. ఒకవేళ 24 గంటల డ్యూటీ కాకుండా 8 గంటల షిఫ్ట్ విధానం అమలు చేస్తే 1.68 రెట్లు వారి పనితీరు మెరుగుపడుతుందనేది ఆ సర్వే సారాంశం. దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన సిబ్బంది కంటే 30శాతం మాత్రమే అందుబాటులో ఉన్నారని సర్వేలో తేలింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖలో సిబ్బందిని భారీగా పెంచాలని యోచిస్తోంది. అందుకనుగుణంగా రిక్రూట్మెంట్లు చేపడుతోంది. ఈక్రమంలో 18వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా.. రానున్న 6 నెలల్లో 12వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. దశలవారీగా నియామకాలు చేపడుతున్నందున షిఫ్టులు, వీక్లీ ఆఫ్స్ తెరపైకి తేవాలన్నది ఉన్నతాధికారుల ఆలోచన.
ఇంతకు ముహుర్తం ఎప్పుడు..?
బీపీఆర్డీ నివేదిక అమలుచేయడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకమే. అయితే కమిషనరేట్లతో పాటు ఆయా జిల్లాల పరిధిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇంకా ఎంతమంది అవసరమవుతారనే విషయాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం. అవన్నీ నివేదికలు వచ్చాక 8 గంటల పని విధానం అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓవర్ టైమ్ అలవెన్సుల చెల్లింపు, వీక్లీ ఆఫ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు ఉన్నతాధికారులు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పంచాయతీ ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే ఛాన్సున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన వీక్లీ ఆఫ్ సక్సెసయినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 4 నెలల పాటు వాటిని రద్దు చేయడం గమనార్హం.