శుభవార్త!: ఇక్కడి ఏటీఎంలకు ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు, ఆర్బీఐ చర్యలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదుకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపశమన చర్యలు ప్రారంభించింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నింపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నగదు తెప్పిస్తోంది.
తెలుగు రాష్ట్రాల ఏటీఎంల్లో నగదుకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. 50 శాతానికి పైగా ఏటీఎంలు పని చేయడం లేదు. పలు ఏటీఎంల ఎదుట 'నో క్యాష్ బోర్డులు' దర్శనమిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనం డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఈ నగదు కొరతను పూడ్చడానికి ఆర్బీఐ తక్షణ చర్యలు చేపట్టింది. ఏపీకి ఒడిశా, తమిళనాడుల నుంచి నగదు రప్పిస్తుంటే.. తెలంగాణకు కేరళ, మహారాష్ట్రాల నుంచి రప్పించి ఏటీఎంలలో నగదు నింపేందుకు చర్యలు చేపట్టింది.
నెలాఖరు కావడం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇలా అన్నీ ఒకేసారి వస్తుండంతో నగదు కొరత ఏర్పడుతోంది. ఈ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్బీఐ సూచలన మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు నగదును తెప్పిస్తున్నారు.