గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం..
హైదరాబాద్ : 'గల్లీ చిన్నది గరీబోని కథ పెద్దది.. వాళ్లున్న ఇల్లు కిల్లికొట్ల కంటే చిన్నగున్నవి' పాటంతా పేదోడి బాధే వినిపిస్తది. కానీ బాధను సైతం ఎగిరి దుంకి చెప్పుకునేట్లు చేసే ఊపు ఒక్క గోరెటి వెంకన్నదే. 'పల్లె కన్నీరు పెడుతుందో..' అని పాటెత్తుకున్నా.. ప్రకృతిని కై గట్టి పాడినా.. గోరటి పాట ప్రతీది మనసును హత్తుకునేదే.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం గోరెటి వెంకన్నకు కాళోజీ కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 9న కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుతూ వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఏటా అవార్డులు ప్రకటిస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
గత సంవత్సరం ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ ను కాళోజీ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ దఫా గోరెటి వెంకన్నకు ఆ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు కింద రూ. 1,01,116ల నగదును ఇవ్వడంతో పాటు వెంకన్నను ఘనంగా సత్కరించనుంది ప్రభుత్వం.