పద్మావతి సినిమా ప్రదర్శించొద్దు, ఆందోళన చేస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
హైదరాబాద్: హైద్రాబాద్లో పద్మావతి సినిమాపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ నిషేధం విధించారు. రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలోని నాలుగు సినిమా థియేటర్లకు ఈ సినిమా ప్రదర్శించకూడదని రాజా సింగ్ ఆదేశించారని సమాచారం.
పద్మావతి సినిమాపై మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిషేధం విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కానీ, యూపీ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాపై ఎలాంటి నిషేధం విధించలేదు. తన నియోజకవర్గంలోని రామకృష్ణ, సంతోష్, స్వప్న, మహేశ్వరీ, పరమేశ్వరీ, వెంకటరమణ థియేటర్ల యజమానులను కలిసి ఈ సినిమాను ప్రదర్శించకూడదని కోరినట్టు రాజాసింగ్ చెప్పారు.అయితే ఈ విషయమై ఈ సినిమా థియేటర్ల మేనేజర్లు మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
హైద్రాబాద్ నగరంలో సుమారు 15 లక్షల మంది రాజ్పుత్లు నివాసం ఉంటున్నారు. పద్మావతి సినిమా ప్రదర్శిస్తే ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని రాజా సింగ్ హెచ్చరించారు.అయితే తన నియోజకవర్గ పరిధిలో ఆందోళన చేయనున్నట్టు మాత్రం రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఈ సినిమాను తెలంగాణలో నిషేధించాలని కోరేందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలవనున్నట్టు రాజాసింగ్ చెప్పారు.ప్రభుత్వ అనుమతితో ఈ సినిమా విడులదలైతే థియేటర్లకు రక్షణ కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.