'పేదల మనసు తెలిసిన లీడర్ కెసిఆర్, వారినొద్దు.. మంత్రులనే కలవండి'
హైదరాబాద్: పేదల కష్టాలు, వారి మనసు తెలిసిన నాయకుడు మఖ్యమంత్రి కెసిఆర్ అని మంత్రి పద్మారావు శుక్రవారం అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందన్నారు. హైదరాబాదులోని అడ్డగుట్టలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది.
ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడారు. అడ్డగుట్టలో రెండు వందల డబుల్ బెడ్ రూంలను నిర్మిస్తున్నామన్నారు. సంక్షేమానికి రూ.34వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. తుకారం గేట్ వద్ద అండర్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు.
మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదవాడి కల అని, అడ్డగుట్టలో ఎనిమిది నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఏ ఒక్కరు కూడా దళారుల మాటలు నమ్మవద్దన్నారు. ఇళ్ల విషయంలో మంత్రులను కలవాలని, కానీ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లు పిట్టగూళ్లలా ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం మాత్రం 600 గజాలలో రెండు పడక గదులు, ఒక వంటగది, ఒక హాల్ నిర్మించి ఇస్తోందన్నారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.
డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 7 లక్షలు వెచ్చిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఐడీహెచ్ కాలనీ అందరీ ప్రశంసలు అందుకుటోందన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్లో లక్ష ఇల్లు కట్టిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గవర్నర్ కూడా మెచ్చుకున్నారన్నారు.