పోలీసుల నిర్బంధంతో ఉద్యమాన్ని ఆపలేరు: కోదండరాం, కన్నీళ్లు కార్చని రోజు లేదు: గద్దర్
హైదరాబాద్ : పోలీసుల నిర్భంధంతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు తక్షణమే భర్తీ చేయాలని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన 'కొలువులకై కొట్లాట' సభలో ఆయన మాట్లాడారు.
వివిధ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టులు చేసినప్పటికీ ఈ సభకు భారీ సంఖ్యలో యువత హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు పలికారు.
కోర్టు అనుమతితో ఎట్టకేలకు సభ...
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖాళీగా ఉన్న ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతను ఆదుకోవాలని టీజేఏసీ కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జేఏసీ ఛైర్మన్ కోదండరాం కొలువుల కొట్లాట సభ నిర్వహించడానికి సుదీర్ఘంగా ప్రయత్నించారు. దీని నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు అనుమతి సాధించి.. సోమవారం సభను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉద్యోగం లేదన్న కారణంతో నలుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులను కూడా సభకు ఆహ్వానించారు. వారు తమ ఆవేదనను సభ ముందు వివరించారు.
ప్రభుత్వ విధానాల లోపం కారణంగానే...
సభలో కోదండరాం మాట్లాడుతూ.. టెట్ పరీక్ష పాసైనవాళ్లందరికీ డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా పరీక్ష రాసే అవకాశం కల్పించాలని డీఎస్సీ పిల్లలు కోరుతున్నారని, తాము వారి డిమాండ్కు ఇక్కడ మద్దతు తెలిపుతున్నామని చెప్పారు. అంతేకాదు, సకాలంలో అడ్మిషన్లు జరిగి ఉంటే.. తమకు ఈపాటికి సెకండియర్ పూర్తయి.. తమకు కూడా టీఆర్సీ పరీక్ష రాసే అవకాశం దొరికేదని, ప్రభుత్వ విధానాల లోపం కారణంగానే అనుకున్నట్టుగా అకాడమిక్ ఇయర్ పూర్తి కాకపోవడంతో తాము ఆ అవకాశాన్ని కోల్పోతున్నామని, టెట్కు అవకాశం ఇచ్చినట్టే టీఆర్టీకి కూడా అవకాశం ఇవ్వాలని డీఎడ్ సెకండర్ విద్యార్థులు కోరుతున్నారని, వారికి కూడా మద్దతు తెలపాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
కన్నీళ్లు కార్చని రోజు లేదు: గద్దర్
తెలంగాణలో ఫ్యూడల్ రాజ్యాధికారం వచ్చిందని, గడిచిన మూడున్నర ఏళ్లలో తాను కన్నీరు కార్చని రోజులేదని ప్రజా కళాకారుడు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. సరూర్నగర్ స్టేడియంలో కొలువులకై కొట్లాట సభఆయన మాట్లాడుతూ అమరులు కలలు కన్న తెలంగాణ రాలేదని దుయ్యబట్టారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా మారాలని పిలుపునిచ్చారు.
కోదండరాం చేసిన తప్పేంటి?: చుక్కా రామయ్య
సభలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న కోదండరాంను నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనడం కోదండరాం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యను సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని, చుట్టూ కీర్తించే వ్యక్తులు ఉన్నప్పుడు వాస్తవాలు తెలియవని, విభేదించినంత మాత్రాన ప్రభుత్వానికి జేఏసీ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు.