రిజల్ట్స్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉంటుంది?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారా? లేదంటే మహాకూటమికి జై కొడుతున్నారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఫలితాలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ పూర్తిగా వచ్చాక ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఫలితాలు వెలువడ్డాక అక్కడున్న రిటర్నింగ్ అధికారులు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందిస్తారు. 119 నియోజకవర్గాల ఫలితాలు వచ్చాక ఒకేసారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. సెంట్రల్ ఈసీ ఆమోదం పొందిన తర్వాత స్టేట్ సీఈవో ఈ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తారు. దీన్ని గవర్నర్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపిస్తారు.
మెజారిటీ అధికంగా వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఫార్మేషన్ కు కావాల్సిన సభ్యుల సంఖ్య తక్కువగా వస్తే.. ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన పార్టీకి ఛాన్స్ ఇచ్చే వీలుంది. దీంట్లో ఏమైనా ఇబ్బందులు గానీ, ప్రతిబంధకాలు గానీ ఎదురైతే న్యాయ నిపుణులతో సంప్రదించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు.
మెజారిటీ ఎక్కువగా వచ్చిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి తమ నేతను ఎన్నుకుని గవర్నర్ కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ కార్యాలయం ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తుంది. ప్రమాణ స్వీకారానికి రాష్ట్రంలోని ప్రముఖులకు, ఆయా పార్టీల ముఖ్యులకు ఇన్విటేషన్లు పంపుతుంది. ఇలా అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంది.