విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యం కాకుండా... సెలవుల పొడగింపు : లక్ష్మణ్
ఆర్టీసీ సమ్మెలో విద్యార్థులు కూడ పాల్గోంటారనే కుట్రతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు.కేసీఆర్ మూర్ఠపు నిర్ణయాలతోనే సమ్మె ఉదృతం అవుతోందని అన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ఇప్పటివరకు ఎలాంటీ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆర్టీసీ కార్మికులను ఎందుకు విస్మరించారని మండిపడ్డారు. మరోవైపు విద్యార్థులకు సెలవులు ఇవ్వడంపై కూడ ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇకనైన మొండివైఖరి వీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కిరణ్కుమార్ రెడ్డి కంటే నిరంకుశంగా కేసీఆర్ వ్యవహరం
ఇక పండగ సమయంలో జీతాలు ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. సమైక్య పాలనలో కూడ మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి కూడ ఇలా చేయలేదని అన్నారు. పని చేసిన సెప్టెంబర్ నెలకు జీతాలు ఇవ్వకుండా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జీతాలు లేకపోవడంతో పండగపూట పస్తులు ఉండాల్సిన అవశ్యకత ఏర్పడిందని అన్నారు. సమైక్యపాలనలో కూడ ఆర్టీసీ సమ్మెనే సకల జనుల సమ్మెగా మారిందని గుర్తు చేశారు. కాగా ఆర్టీసీకి మద్దతు పలకాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి పెట్టిన భోజనానికి వెళ్లాల్సిన అవసరం ఏంటనీ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యార్థులు సమ్మెలో పాల్గోంటారనే సెలవుల పొడగింపు
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అభివృద్దికి కృషి చేయలేదని విమర్శించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్టీసీ బలోపేతానికి కనీసం ఒక్క చర్య అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. పైగా కార్మికుల డబ్బును కూడ వాడుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తానని,ఉద్యోగులు ఎవ్వరు కూడ యూనియన్లు పెట్టుకోవద్దని మరో కొత్త రాజ్యంగాన్ని సృష్టిస్తున్నారని తీవ్రంగా మండిడ్డారు. మరోవైపు విద్యార్థుల సెలవులపై కూడ ఆయన ఫైర్ అయ్యారు. దసరా సెలవులు ఏనాడైన 19 రోజులు ఇచ్చారా ప్రశ్నించారు. విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యులు అవుతారనే ఆలోచనతోనే సెలవులు పొడగించారని ఆయన అన్నారు.
శ్రీనివాస రెడ్డిది ప్రభుత్వ హత్యే
ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో శనివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన డ్రైవర్ శ్రీనివాస్రెడ్డిది ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంలోని మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఆయన మరణానికి ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలని అన్నారు. శ్రీనివాసరెడ్డి మరణం ప్రభుత్వ పతనానికి నాంది కాబోతోందని అన్నారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు.