సీఎం కేసీఆర్కు జంట సవాళ్లు: నేరెళ్ల ఇష్యూ ప్లస్ కరీంనగర్ మెడికల్ కాలేజీ
రోజులు గడుస్తున్నాకొద్దీ తెలంగాణ ప్రభుత్వానికి సమస్యలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్: రోజులు గడుస్తున్నాకొద్దీ తెలంగాణ ప్రభుత్వానికి సమస్యలు పెరుగుతున్నాయి. గత నెల రెండో తేదీన సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీల కింద పడి భూమయ్య అనే వ్యక్తి మరణంతో ఆగ్రహించిన స్థానికులు లారీ దగ్ధం చేయడం, ఆ పై పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడం.. ఆందోళనకారులను చిత్ర హింసల పాల్జేసిన ఘటన జాతీయస్థాయిని ఆకర్షించింది. రాష్ట్రంతోపాటు జాతీయ నాయకులు సైతం సందర్శిస్తున్నారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ రావడంతో నేరెళ్ల సమస్య జాతీయస్థాయిలో దృష్టి మరల్చింది.
మరోవైపు మూడేళ్ల క్రితం ఇచ్చి హామీ అమలు చేయాలని కోరుతూ కరీంనగర్లో వైద్యకళాశాల ఏర్పాటు కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకున్నది. ఈ నెల పంద్రాగస్టులోగా సమస్య పరిష్కరించని పక్షంలో ఇతర పక్షాలతో కలిసి నేరెళ్ల దిగ్బంధం చేస్తామని టీడీపీ హెచ్చరించింది.
ఇసుక మాఫియా మంత్రి కేటీఆర్ బినామీలని విమర్శలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు గత ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. మూడేళ్లలోనే పరిస్థితులు తారుమారు కావడానికి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల దూకుడు వ్యవహారం ప్రభుత్వానికి బొప్పిగట్టించింది. ప్రభుత్వ కనుసైగ లేకుండానే పోలీసులు దూకుడుగా వ్యవహరించారని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కనుక ప్రభుత్వమే ప్రజల ముందు తొలి ముద్దాయిగా నిలిచిందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మిడ్ మానేరులో వచ్చే డిసెంబర్నాటికి 10 టీఎంసీల నీటి నిల్వ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అందులోని ఇసుకను తోడేసుకునేందుకు అవకాశం దక్కింది. దీన్ని కాంట్రాక్టర్లు పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. అందులోనూ ఇసుక మాఫియాకు బాధ్యులైన వారు కేసీఆర్, కేటీఆర్లకు బినామీలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నించకపోగా ఏకంగా సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లోనే లారీలను కాల్చి గుండాగిరీ చేస్తే ఊరుకుంటామా? అనడం మరో సమస్యకు తెచ్చిపెట్టింది.
Recommended Video
పోలీసుల ధాష్టీకానికి ఎస్సీ, బీసీలకే నష్టం
లారీ కింద పడి చనిపోయింది గిరిజనుడే కాగా, పోలీసుల చిత్రహింసలకు గురైంది దళితులు, బీసీలే. ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు సైతం పక్కాగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల ప్రత్యేకించి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ రాక అందరి దృష్టినీ ఆకర్షించింది. జైల్లో బాధితులను పరామర్శించడంతోపాటు నేరెళ్లలో వారి కుటుంబసభ్యులను సైతం తన ఒడికి చేర్చుకున్నారు. వారి దు:ఖాన్ని కళ్లారా చూసి ఆమె కూడా కంటతడి పెట్టుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. బెయిల్పై విడుదలైన బాధితులు తమ గోడు చెప్పుకున్న సందర్భం కూడా చూసిన వారందరినీ బాధించింది. శుక్రవారం నాడు టీడీపీ నాయకత్వం నేరెళ్లను సందర్శించి వేములవాడలో బాధితులను పరామర్శించి కరీంనగర్లో కొనసాగుతున్న దళిత సంఘాల దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికింది. అందులోనూ పంద్రాగస్టులోగా నేరెళ్ల బాధితులకు న్యాయం చేయని పక్షంలో ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని టీడీఎల్పీ నాయకులు రేవంత్రెడ్డి సంచలన ప్రకటించడంతో ప్రభుత్వం ఆలోచనలో పడాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి కరీంనగర్ జిల్లా పర్యటనలో కరీంనగర్లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లయింది.
హామీ అమలు కోసం పొన్నం దీక్ష
సీఎం హామీ కార్యరూపం దాల్చకపోవడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 5లోగా అందుకు అనుకూలమైన ప్రకటన వెలువడని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. ఆ ప్రకటన రాకపోగా ఆయన దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి కూడా లభించకపోవడంతో తన ఇంటి ముందే శనివారం దీక్ష ప్రారంభించారు. దానికి పార్టీతోపాటు ప్రజల మద్దతు కూడా అనూహ్యంగా లభించింది. కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోటలోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొండి అయితే తాను జగమొండి అని, ఆయన కోరుకుంటే తాను చావుకైనా సిద్ధమని అన్నారు. నిరవధిక దీక్షకు మద్దతు పలికిన వివిధపార్టీ నేతలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మూడేళ్లుగా గుర్తు చేస్తూనే ఉన్నామని తెలిపారు. 2016 ఆగస్టు 5న వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం అనేక రూపాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇప్పటికే జిల్లాకు రావాల్సిన హార్టికల్చర్ యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, ఐటీ, టెక్స్టైల్ పార్కు ఇతర జిల్లాలకు తరలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మెడికల్ కళాశాల కూడా రాకుండా పోతుందనే ఆవేదనతో ఆమరణ దీక్ష చేపట్టినట్లు వివరించారు.
కరీంనగర్ సహా ఇతర జిల్లాల్లో ఏర్పాటు మాటేమిటి?
2016 అక్టోబర్ 13న సిద్దిపేటకు మెడికల్ కళాశాల ప్రకటించి డిసెంబర్లో ఎన్ఓసీ ఇచ్చారని గుర్తు చేశారు. 2017 మార్చి 4న జీవో 21 ద్వారా రూ. 717 కోట్లు మంజూరు చేసి 900 పోస్టులు మంజూరు చేశారని చెప్పారు. సిద్దిపేటకు ఇవ్వడాన్ని తప్పు పట్టడం లేదని పేర్కొన్నారు. అంతకన్నా ముందు 2014లో ఇచ్చిన హామీని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కుట్రకు బలికావద్దని దీక్ష విరమించాలని పెద్ద మనసుతో జానారెడ్డి సూచించారని తెలిపారు. తన వ్యక్తిగత స్వలాభం కోసమే చేయడం లేదని, నిరుపేదలకు మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు అందేందుకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత చూసి అసహనం కోల్పోయి సీఎం మాట్లాడుతున్నారన్నారు. గత అవతారం ఎత్తుతానని చెప్పడం కేసీఆర్ మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. దుబారు ఏజెంటుగా మారే ప్రమాదం ఉందని ఎద్దేవా చేశారు.
ఇదేం పాలన అని నిలదీసిన జానారెడ్డి
పొన్నం ప్రభాకర్ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సీఎల్పీ నేత కే జానారెడ్డి మాట్లాుడుతూ తెలంగాణ ఉద్యమం సాగిప్పుడు తాము అధికారంలో ఉన్నా ఉద్యమాలకు సంబంధించిన అనేక విషయాల్లో అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ‘ఇప్పుడు అధికారంలో ఉన్న మీలా మేము అప్పుడు వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా?' అని ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రశ్నించారు. వైద్య కళాశాల హామీ అమలును ప్రభాకర్ ప్రజల పక్షాన కోరుతున్నారన్నారు. ఈ విషయంలో తాను కూడా సీఎంకు లేఖ రాశానని, ఇప్పటికీ సమాధానం రాలేదని చెప్పారు. దీక్షకు విద్యార్థులు, యువకులు రాకుండా నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు.