దేనికైనా రెడీ, అది నిజమే: వర్షాలపై కేటీఆర్, మెదక్లో కొడుకును కాపాడబోయి..
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తాము ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ శుక్రవారం చెప్పారు. రోడ్లు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే అన్నారు. జీహెచ్ఎంసి ద్వారా ముంపు బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారన్నారు.
అపార్టుమెంట్లలో నీటిని తోడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామని చెప్పారు. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. వరద ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
నాలాలను ఆక్రమించిన అంశాలపై ఓ కమిటీని వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని చెప్పారు. తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెవెన్యూ, జిహెచ్ఎంసి, పోలీస్.. ఇలా అందరూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
అన్ని శాఖల అధికారులను కో ఆర్డీనేట్ చేస్తున్నామని చెప్పారు. ప్రయివేటు సంస్థల ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. భారీ వర్షం కారణంగా ప్రజారోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు.
ఆసుపత్రులలో ఆరోగ్య శాఖ మంత్రి పర్యటిస్తారని చెప్పారు. ప్రస్తుతం వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టిందన్నారు. మంత్రులంతా రాత్రి అంతా డ్రైయినేజీ, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారని చెప్పారు. 80 శాతం చెరువులు కుంటలు నిండాయని చెప్పారు. ఎక్కడికి అక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.
ఢిల్లీ నుంచి కేసీఆర్ సమీక్ష
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి వర్షాల పైన సమీక్ష నిర్వహించారు. అసాధారణ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని సిఎస్ను ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై సాయం అందించాలని సూచించారు. రోడ్లు తెగిపోవడం, గుంతలు పడటం బాధాకరమని కేసీఆర్ అన్నారు.
పోచారం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వానలు పడుతున్నాయి. జిల్లాలోని నవీపేట, భీంగల్, ఎడపల్లి, రెంజల్, దర్పల్లి, జుక్కల జక్రాన్పల్లి, కోటగిరి, తాడ్వాయి, వర్ని, బాన్సువాడ, డిచ్పల్లి, గాంధారి, బిక్కనూరు తదితర మండలాల్లో వానలు పడుతున్నాయి. బోధన్ మండలం సాలూర వద్ద మంజీర నదీ ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టుకు వరదనీరు గంట గంటకు పెరుగుతుంది. డ్యాం మొత్తం 21 అడుగులకు గాను ఇప్పటికే 18 అడుగులకు నీటిమట్టం చేరింది.
కొడుకును కాపాడబోయి...
మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగూరులో విషాదం చోటుచేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఓ కారు మునిగింది. అప్రమత్తమైన తండ్రి కారులో నుంచి కొడుకును రక్షించి తాను నీటిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన తండ్రి మృతిచెందాడు. మరోవైపు, హత్నూర్ మండటం పల్పనూరు గ్రామశివారులో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ కారు చిక్కుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.