సర్కార్ బడిని బతికించారు.. పదేళ్ల కిందట మూతపడితే..!
కొత్తపల్లి : ప్రైవేట్ స్కూళ్ల హంగామాతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవుతోంది. తమ పిల్లలకు మెరుగైన విద్య అందుతుందనే భావనతో ప్రైవేట్ స్కూళ్లకు క్యూ కడుతున్నారు పేరెంట్స్. కానీ మారుతున్న కాలంలో సర్కార్ బడుల్లో కూడా బెటర్ ఎడ్యుకేషన్ దొరుకుతోందనే విషయం మరిచిపోతున్నారు. అయితే పుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చి ఉచితంగా విద్య అందిస్తున్న గవర్నమెంట్ స్కూళ్లకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!
పదేళ్ల నుంచి బడి బంద్.. గ్రామస్తుల సంకల్పంతో పునరుజ్జీవం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో సర్కార్ బడి మూతపడి పదేళ్లవుతోంది. గవర్నమెంట్ స్కూళ్లల్లో విద్యార్థులు లేకుంటే ఆయా పాఠశాలలను అధికారులు మూసివేస్తున్నారు. ఆ క్రమంలో ఈ పాఠశాల కూడా మూతపడింది. అయితే ప్రభుత్వ పాఠశాలకు పునరుజ్జీవం పోయాలనే గ్రామస్తుల సంకల్పంతో సోమవారం నాడు తిరిగి తెరుచుకుంది.
పదేళ్ల పాటు మూతపడ్డ సర్కార్ బడి మళ్లీ ప్రారంభం కావడంపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ గ్రామంలో నివసించే ప్రజలు అధికశాతం ఇసుక ట్రాక్టర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఉన్న ఒక్క బడి ఊర్లో మూతపడటంతో తమ పిల్లలను కరీంనగర్లో చదివిస్తున్నారు. అక్కడే అద్దెకు ఉంటూ అటు పిల్లలను చదివిస్తూ ఇటు జీవనపోరాటం చేస్తున్నారు.
ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బడిబాట ఎఫెక్ట్
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు బడి బాట కార్యక్రమంలో భాగంగా.. ఖాజీపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో టీచర్లు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన తదితర అంశాలు వివరించారు. పిల్లల్ని సర్కార్ బడులకు పంపుతూ మూతపడుతున్న పాఠశాలలను బతికించాలని కోరారు. అలా చాలా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో చర్చించి పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్లల్లో చేర్పించేలా తీర్మానించారు. అలా మూతపడే దశకు చేరుకున్న పాఠశాలలు తిరిగి విద్యార్థుల చేరికతో కొత్త కళ సంతరించుకున్నాయి.
బడికి పునరుజ్జీవం.. గ్రామస్తుల సంబరాలు
అదే క్రమంలో కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో పదేళ్ల కిందట మూతపడ్డ సర్కార్ బడి మళ్లీ తెరుచుకుంది. జనవరిలో కొత్త పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు తిరిగి జీవం పోయాలనే దానిపై దృష్టి సారించారు ప్రజాప్రతినిధులు. ఆ క్రమంలో మూతపడ్డ బడికి పునరుజ్జీవం పోద్దామని డిసైడయ్యారు. ఆ క్రమంలో గ్రామస్తులకు సర్కార్ బడి గురించి వివరించడంతో వారు కూడా ఓకే చెప్పారు.
అలా గ్రామంలో 25 మంది పిల్లల్ని సర్కార్ బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఆ విషయం విద్యాధికారికి తెలియజేయడంతో ఆయన పాజిటివ్గా స్పందించారు. పాఠశాల కోసం భవనం ఏర్పాటు చేయించి సిబ్బందిని కేటాయించారు. దాంతో సోమవారం నాడు పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు కలిసి స్కూలును తిరిగి ప్రారంభించి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు.
హుజుర్ నగర్ రికార్డ్.. కొత్తగా 130 మందికి అడ్మిషన్లు
అదలావుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్ NSP క్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈసారి 130 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారికి స్థానిక ఎంఈవో ఆధ్వర్యంలో సోమవారం నాడు అడ్మిషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులను 130వ సంఖ్య ఆకారంలో కూర్చోబెట్టి హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. అంతకుముందు 310 మంది విద్యార్థులుండగా కొత్తగా చేరిన స్టూడెంట్స్తో మొత్తం సంఖ్య 440కి చేరింది.
ఆదరణ పెరుగుతోంది.. కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే..!
ప్రభుత్వ పాఠశాలలకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. అయితే గవర్నమెంట్ స్కూళ్లలోనూ నాణ్యమైన విద్య దొరుకుతోందనే నమ్మకం తల్లిదండ్రులకు కలగించాల్సిన బాధ్యత మాత్రం ఉపాధ్యాయులదేననే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాధ్యతగా ఆలోచిస్తే తప్పకుండా సర్కార్ బడులు విద్యార్థులతో కళకళలాడుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు.
మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం