ఒకరు హెచ్ఎం.. మరొకరు మహిళా టీచర్.. ఇద్దరి నోట బూతు పురాణం..!
హైదరాబాద్ : ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పదిమందికి ఆదర్శంగా నిలవాల్సినోళ్లు ఛీ అనిపించుకున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సినోళ్లు దారి తప్పారు. మంచిమాటలు చెప్పాల్సినోళ్లు బూతు పురాణం అందుకున్నారు. ఆ ఇద్దరి నోళ్లు తిట్ల దండకం అందుకుంటే తోటి సిబ్బంది, విద్యార్థులు నివ్వెరపోయారు.
ఒక్కచోట పనిచేయాల్సి వచ్చినప్పడు సర్దుకుపోవాలి. ఉద్యోగ సహచరులు తమను పట్టించుకోవడం లేదనుకుంటే వారితో నేరుగా మాట్లాడాలి. కానీ, ఆ ఇద్దరి ఉపాధ్యాయుల విషయంలో అలా జరగలేదు. చిన్న కారణంతో నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో దుమ్మెత్తిపోసుకున్నారు. అంతటితో ఆగకుండా నోటికి ఎంతొస్తే అంత బూతులతో చిందులేశారు.
సర్కార్ బడిని బతికించారు.. పదేళ్ల కిందట మూతపడితే..!
విద్యార్థుల ఎదుటే బూతు పురాణం
రంగారెడ్డి జిల్లా గండిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్ల బూతు పురాణం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాములు, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మనోరమ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాఠాలు బోధించాల్సింది పోయి తోటి సిబ్బంది, విద్యార్థుల ఎదుటే గొడవకు దిగారు. వారంతా తమను గమనిస్తున్నారనే విచక్షణ మరచిపోయి నోటికి ఎంతొస్తే అంత తిట్టేసుకున్నారు.
ప్రేయర్ విషయంలో ముదిరిన గొడవ
ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల బూతు పురాణం బయటకు పొక్కడంతో జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. సోమవారం ఉదయం నాడు జరిగిన ఘటన ఇద్దరి మధ్య తిట్ల దండకానికి కారణమైంది. ఆ రోజు ఉదయం 8 గంటల 55 నిమిషాలకే పాఠశాలకు చేరుకున్నానని చెబుతున్నారు మనోరమ. అప్పటికే ప్రధానోపాధ్యాయుడు రాములు ప్రార్థన నిర్వహించి విద్యార్థులను తరగతి గదుల్లోకి పంపించారనేది ఆమె వాదన. అయితే, ప్రతి రోజు 9 గంటల 15 నిమిషాలకు జరగాల్సిన ప్రార్థనను ముందే ఎందుకు నిర్వహించారని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది.
నువ్వెంతంటే నువ్వెంత.. తిట్ల దండకం
ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. దాంతో మనోరమ తన మొబైల్ ఫోన్ను విసిరికొట్టడంతో అది ప్రధానోపాధ్యాయుడి కాళ్ల దగ్గర పడింది. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి తనపై ఫోన్ ఎందుకు విసిరావంటూ అదే ఫోన్ను మనోరమ వైపు విసిరికొట్టాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం పీక్ స్టేజ్కు చేరింది. దాంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తిట్ల దండకం అందుకున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాటలు అనేసుకున్నారు.
అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!
సహచర ఉద్యోగులు, ఎంఈవో జోక్యం.. చివరకు రాజీ
దూషణల పర్వం మరింత వేడెక్కడంతో తోటి సిబ్బంది కలుగజేసుకున్నారు. ఆ ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారి నోళ్లు ఏమాత్రం ఆగలేదు. ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్నారు. విద్యార్థులు చూస్తున్నారనే ఇంగీత జ్ఞానం లేకుండా బూతు పురాణం వల్లించడంతో వివాదస్పదమైంది. చివరకు మనోరమ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు స్కూల్కు వచ్చి దర్యాప్తు చేశారు. అయితే అంత తిట్టుకున్నాక.. సాయంత్రానికి రాజీ కుదరడం గమనార్హం. ఎంఈవో తో పాటు సహచర ఉపాధ్యాయులు గొడవ పెద్దదిగా చేసుకోవద్దని సూచించడంతో వారు తగ్గినట్లు తెలుస్తోంది.