మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ: భారీగా భక్తులు
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజ చేశారు. రాజ్భవన్ నుంచి మండపం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు.
ఖైరతాబాద్ గణపతి
అనంతరం అర్చకుల వేద మంతోచ్ఛరణల మధ్య వినాయకుడికి గవర్నర్ దంపతులు తొలిపూజ నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మహాగణపతిని కోరుకున్నట్లు గవర్నర్ నర్సింహన్ ఈ సందర్భంగా తెలిపారు.
ఖైరతాబాద్ గణపతి
మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి.
ఖైరతాబాద్ గణపతి
58అడుగుల ఎత్తులో 28అడుగుల వెడల్పుతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.
ఖైరతాబాద్ గణపతి
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఖైరతాబాద్ గణపతి
అంతకుముందు నల్గొండ పద్మశాలి సంఘం తరఫున మహాగణపతికి 75 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. కండువాను నలభై రోజుల పాటు భక్తిశ్రద్ధలతో తయారుచేసినట్లు పద్మశాలీ సంఘం సభ్యులు యాదగిరి, లింగయ్య తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరురా, వీధి వీధినా గణేష్ మండపాలు వెలిశాయి. కాణిపాక క్షేత్రంలో సోమవారం ఉదయం నుంచీ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. విజయవాడ, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.