ప్రధాని మోడీ, అమిత్ షాతో గవర్నర్ సౌందరరాజన్ భేటీ: సమ్మె సహా తాజా పరిస్థితిపై చర్చ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 40నిమిషాలపాటు ఈ సమావేశం సాగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసాయి మంగళవారం సాయంత్రం ప్రధానితో సమావేశమై.. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వివరించారు.
ప్రధాని అభినందించారు..
తెలంగాణ రాజ్భవన్ ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాలను ప్రధాని మోడీ అభినందించారని గవర్నర్ తమిళిసాయి తెలిపారు. ప్లాస్టిక్ రహిత, యోగా క్లాసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సాయంతో రక్తదాన శిబిరాలు లాంటి కార్యక్రమాలను తాము నిర్వహించామని ప్రధానికి వివరించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్లు తెలిపినట్లు చెప్పారు.
ఇదే తొలిసారి..
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళిసాయి మోడీని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతోనూ గవర్నర్ తమిళిసాయి భేటీ అయ్యారు. ఇటీవల ముగిసిన బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన పబ్లికేషన్ను ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు అందించినట్లు తెలిపారు. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మను ఐదురోజులపాటు రాజ్భవన్లో నిర్వహించినట్లు తెలిపారు.
సమ్మె నేపథ్యంలో ప్రాధాన్యత
కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత 11 రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగం పోతుందనే ఆందోళనతో ఇద్దరు కార్మికులు కూడా బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.