రిపబ్లిక్ డే: సంక్షోభాన్ని అధిగమించాం: కేసీఆర్ సర్కారుపై గవర్నర్ ప్రశంసలు
హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసుదనా చారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
జెండా ఎగరేసిన అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. తెలంగాణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించిందన్నారు. పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్నారు.
Recommended Video
వృద్ధులు, వితంతువులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నమన్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులు, వీఆర్ఏలకు వేతనాలు పెంచినట్లు గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. రైతులకు సమయానికి ఎరువులు, విత్తనాలు అందిస్తున్నమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు సాగునీరందుతుందని చెప్పారు. రైతులకు ఈ ఏడాది నుంచి పంట పెట్టుబడి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం 22 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మిస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, ప్రభుత్వ దిగ్విజయంగా భూరికార్డుల ప్రక్షాళన నిర్వహించిందన్నారు.
యాదవ, కురుమలకు గొర్రెలను అందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. 'గంగపుత్రుల సంక్షేమానికి చేపపిల్లలను పంపిణీ చేస్తున్నం. నాయిబ్రాహ్మణుల కోసం అధునాతన సెలూన్లు ఏర్పాటు చేస్తున్నం. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం చేపట్టినం. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నం. ఐటీ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి సాధించాం. అని గవర్నర్ వెల్లడించారు.
గవర్నర్, సీఎం గణతంత్ర శుభాకాంక్షలు
అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ దేశం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా జరుపుకొంటున్నదని, ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులుగా బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో అందరూ అహర్నిశలు శ్రమించాలని అన్నారు.