ఆనంద్ నగర్ ఆగ్రహం, కదిలిన గవర్నర్: రాజకీయాల్లో అసహనం: కెసిఆర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు ఆనంద్ నగర్ కాలనీలో అకస్మాత్తుగా పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన పర్యటించారు. పలువురు స్థానికులు రాజ్ భవన్కు ఉదయం నుంచి ఫోన్లు చేసి ఫిర్యాదులు చేశారు.
తమ కాలనీ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గవర్నర్ ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనంద్ నగర్ స్వచ్ఛ భారత్ ప్యాట్రన్గా గవర్నర్ నరసింహన్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఫిర్యాదులు రావడంతో... ఆయన స్వచ్ఛ భారత్ జరుగుతున్న తీరును పరిశీలించారు. కాలనీలో పరిస్థితి బాగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అపార్టుమెంటుల్లోకి వెల్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, డ్రెయినేజ్ లైన్లను పరిశీలించారు. రోడ్లపై నీరు ఆగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రాజకీయాల్లో అసహనం పెరుగుతోంది: కెసిఆర్
ప్రస్తుత రాజకీయాల్లో అసహనం పెరుగుతోందని, ఇది మంచిది కాదని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనివ్వనని చెప్పారు. గ్రాండ్ కాకతీయలో జరుగుతున్న జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని, చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి నర్సింగ రావు అన్నారు. జీవీ బతికి ఉండి ఉంటే ఉన్నతస్థాయికి వెళ్లేవారని, ఆయన విశిష్టతను ముందు తరాలకు తెలియజేసేందుకు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి నిర్ణయిస్తామన్నారు.