చెట్లు కూలాయి: డయల్ '100'కు సామాన్యుడిలా గవర్నర్ ఫోను
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో ఈదురు గాలులకు భారీగా వృక్షాలు, హోర్డింగ్లు నేలకూలాయి. చాలా నష్టం జరిగింది. సామాన్యులు వీటిపై ఫిర్యాదులు చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తులు అందాయి. గవర్నర్ నరసింహన్ కూడా సామాన్యుడిలో 100 నెంబర్కు డయల్ చేసి, సహాయక చర్యలను కోరారు.
నేను నరసింహన్ను మాట్లాడుతున్నానని, మాదాపూర్లో చెట్లు నేలకొరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని గవర్నర్.. డయల్ 100కు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గవర్నర్ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిని అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి ఫిర్యాదు చేయాలని అడగగా.. డయల్ 100కి ఫోన్ చేస్తే సరిపోతుందని కమిషనర్ తెలిపారు.
అనంతరం ల్యాండ్ లైన్ నుంచి డయల్ 100కి ఫోన్ చేయగా కలవకపోవడంతో తిరిగి సెల్ ఫోన్ ద్వారా గవర్నర్ ఫోన్ చేశారు. మాదాపూర్ నుంచి నరసింహన్ను కాల్ చేస్తున్నానని, రహదారులపై చెట్లు పడిపోయాయని, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఫోన్ అందుకున్న వ్యక్తి వివరాలను నమోదు చేసుకుని తాను జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారాన్ని అందిస్తానని చెప్పారు. అనంతరం మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ సెల్ ఫోన్కు ఓ ఫోన్ వచ్చింది. ఫిర్యాదు సక్రమమైందో కాదో తెలుసుకునేందుకు కాల్ చేస్తున్నట్లు చెప్పిన అధికారులు, సహాయక చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. శనివారం రాజ్భవన్కు వెళ్లిన కమిషనర్కు గవర్నర్ ఈ వివరాలను వెల్లడించారు.