పుష్కరాలు: గొందిమళ్లలో గవర్నర్ దంపతులు, సాగర్లో ఎన్టీఆర్ తల్లి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. శ్రావణ శనివారం కావడంతో ఈరోజు భక్తుల రద్దీ పెరుగుతోంది. బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 11 గంటల సమయం వరకు 88,500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మరోవైపు పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కానుకలు సమర్పించుకుంటున్నారు. పుష్కరాల్లో భాగంగా మహబూబ్నగర్జిల్లా అలంపూర్ సమీపంలోని గొందిమళ్ల పుష్కరఘాట్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు పుష్కర స్నానమాచరించారు.
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇప్పటికే ఏపీ పరిధిలోని విజయవాడ పున్నమి ఘాట్లో పుష్కర స్నానం చేసిన గవర్నర్ దంపతులు తాజాగా తెలంగాణలోని గొందిమళ్ల పుష్కర ఘాట్లో పుష్కర స్నానమాచరించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ దంపతులు అలంపూర్కు బయర్దేరి వెళ్లారు.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ దంపతులను వెంట ఉండి గొందిమళ్ల తీసుకెళ్లారు. పుష్కర స్నానమాచరించిన అనంతరం అలంపూర్ శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్నారు. అలంపూర్లోని కుంకుమార్చన మండపలంలో నిర్వహిస్తున్న శత చండీయాగంలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్లో ఎన్టీఆర్ తల్లి షాలిని పుష్కర స్నానం
సినీ నటుడు జూ. ఎన్టీఆర్ తల్లి నందమూరి షాలిని శుక్రవారం నాగార్జున సాగర్ శివాలయం వీఐపీ ఘాట్లో పుష్కర స్నానమాచరించారు. ఎన్టీఆర్ తల్లి శివాలయం ఘాట్లో స్నానం చేస్తున్న విషయాన్ని గమనించిన భక్తులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెను పలకరించే ప్రయత్నం చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారు.