తెలుగు రాక రూ.240 ఇంక్రిమెంట్ కోల్పోయిన గవర్నర్ నరసింహన్!
హైదరాబాద్: తెలుగు చదవడం, రాయడం రాకపోవడం వల్ల గవర్నర్ నరసింహన్ ఆరు నెలల్లో రూ.240 ఇంక్రిమెంట్ కోల్పోయారు! ఈ విషయాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వయంగా గురువారం నాడు వెల్లడించారు. ఆయన ఇంక్రిమెంట్ కోల్పోయింది.. ఐపీఎస్ అధిగారిగా ఉన్నప్పుడు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల సదస్సులో గవర్నర్ నరసింహన్ మాటలాడారు. ఈ సందర్భంగా గతంలో ఏపీపీఎస్సీతో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఇక్కడ పని చేసే సమయంలో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అని, పీఎస్సీ పెట్టే ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇంక్రిమెంటు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.
తెలుగు చదవడం, రాయడం వచ్చా అంటే తాను వచ్చు అని చెప్పానని, కానీ వారు చదవమంటే చదవలేకపోయానని, అలాగే రాయమంటే రాయలేకపోయానని తెలిపారు. వారితో కేవలం తెలుగులో మాట్లాడగలిగానని చెప్పారు. దీంతో తనకు ఇంక్రిమెంట్ రాలేదని చెప్పారు.
ఆ తర్వాత ఆరు నెలల అనంతరం.. తనకు తెలుగు మాట్లాడడం వచ్చిందని, ప్రజలు చెప్పింది అర్థం చేసుకుని వారితో మాట్లాడగలనని, మీరు ఇంక్రిమెంట్ ఇవ్వకపోవడంతో నెలకు రూ.40 చొప్పున రూ.240 నష్టపోయానని, దయచేసి ఆ విషయం చూడాలని కోరానని, వాళ్లు తన పరిస్థితి అర్థం చేసుకొని సరేనన్నారని చెప్పారు. ఈ సమయంలో అందరు చిరునవ్వులు చిందించారు.