'డబుల్ బెడ్రూమ్' పథకంపై గవర్నర్ ప్రశంస, 'టీ'లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
హైదరాబాద్: పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం బాగుందంటూ గవర్నర్ నరసింహాన్ కొనియాడారు. మంగళవారం మధ్యాహ్నం బోయగూడలోని ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను గవర్నర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ ఐడీహెచ్ కాలనీ గురించి సీఎం కేసీఆర్ తనకు వివరించారని అందుకే తాను చూసేందుకు వచ్చినట్లు చెప్పారు. ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్లకు కేటాయించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే ఇవి బాగున్నాయని ప్రశంసించారు.
ఐడీహెచ్ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు పెత్తనం చేయరాదని, పర్యవేక్షణ మాత్రమే చేయాలని గవర్నర్ సూచించారు. ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఐడీహెచ్ కాలనీని పరిశీలిస్తానని గవర్నర్ తెలిపారు. గవర్నర్తో పాటు తెలంగాణ మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు తదితరులు ఉన్నారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
తెలంగాణలో తాజాగా మూడు స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానాలను పెంచుతూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం పెరిగనుంది.
లంబాడీ హక్కుల సాధనకు పోరాడతాం: ఉత్తమ్
లంబాడీ హక్కుల సాధనకు శాసనసభ వేదికగా పోరాడతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన లంబాడీ హక్కుల సమరభేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.