కేసీఆర్ సర్కార్ కు చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్న గవర్నర్ తమిళ సై
కెసిఆర్ సర్కార్ కు చుక్కలు చూపించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం రాజ్ భవన్ కే పరిమితమై రాష్ట్రాల పాలనలో జోక్యం చేసుకోని గవర్నర్లు చాలామంది ఉన్నారు. కానీ వారందరికీ భిన్నంగా తమిళ సై తాను రాజ్ భవన్ కే పరిమితం కాదని ప్రజాక్షేత్రంలోకి వెళతానని తేల్చిచెప్పారు.గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఇప్పటికే రాజ్ భవన్ లో పెను మార్పులు తీసుకువచ్చారు.
వివిధ శాఖల పనితీరు సమీక్షించనున్న గవర్నర్ తమిళ సై
ప్రతిరోజు రాజ్ భవన్ వేదికగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ ను నిర్వహించాలనే ఆలోచనలో గవర్నర్ తమిళ సై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల పనితీరును సమీక్షించడానికి అధికారులను వివరాలు కోరారు తమిళ సై. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రబలిన వైరల్ జ్వరాల దృష్ట్యా ఆరోగ్య మరియు వైద్య విభాగాన్ని సమీక్షించాలని భావించిన ఆమె వైరల్ జ్వరాలు మలేరియా మరియు డెంగ్యూ వలన సంభవించిన మరణాల వివరాలను తనకు తెలియజేయాలని సచివాలయ సిబ్బందిని కోరారు.
అన్ని శాఖల్లోనూ మంత్రులు నివేదిక తయారీలో బిజీ
ఇక తమిళ సై ఆదేశాల దృష్ట్యా అన్ని శాఖల్లోనూ మంత్రులు సైతం ఇప్పుడు నోట్స్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు.ఏ క్షణమైనా గవర్నర్ తమిళ సై తమను కూడా వివరాలు అడగవచ్చు అన్న ఉద్దేశంతో హోంమంత్రి మహమూద్ అలీ ఇప్పటికే తన శాఖలోని అధికారులను సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.ఇక అంతే కాదు ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలపై కూడా తమిళ సై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్ భవన్ కే పరిమితమై పాలన చేసిన గత గవర్నర్ నరసింహన్
రాజ్ భవన్ కే పరిమితమైన గవర్నర్ గా తాను ఉండటానికి ఇష్టపడనని చెప్పిన తమిళ సై రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన వివరాలను సేకరించి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.గతంలో గవర్నర్ గా నరసింహన్ ఉన్న సమయంలో కేవలం పుణ్యక్షేత్రాల పర్యటనకు మాత్రమే పరిమితమై పాలన విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా పని చేశారు. కెసిఆర్ చెప్పిన వాటికి సానుకూలంగా స్పందించిన నరసింహన్ ఒక ఉత్సవ గవర్నర్ గా రాజ్ భవన్ కే పరిమితమయ్యారు.
ప్రజా దర్బార్ నిర్వహించే ఆలోచనలో గవర్నర్ తమిళ సై
తమిళ సై సౌందరరాజన్ మాత్రం త్వరలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటాను అని చెబుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించనున్నారు అన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి సమగ్ర వివరాలను సేకరించే పనిలో ఉన్న ఆమె గవర్నర్ కు ఉన్న పవర్స్ ఎలా ఉంటాయో ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో చూపించడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మోడీ వదిలిన బాణం మరి కెసిఆర్ సర్కార్ ని టార్గెట్ చేస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలను బట్టి తప్పకుండా అన్న మాటే వినిపిస్తుంది.