జలవిహార్ లో దత్తన్న అలయ్ బలాయ్ .. తెలుగులో మాట్లాడిన తెలంగాణా గవర్నర్ తమిళ సై.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకోవడం ఇది చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళసై, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని కొనియాడారు. ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జలవిహార్ లో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళ సై తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గవర్నర్ తమిళసై తో చిరంజీవి భేటీ: ఆసక్తి కర చర్చ :సైరా చూడాలని ఆహ్వానం..!
గురువారం జలవిహార్లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరకీ మరొకసారి దసరా శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ తమిళ సై. అలయ్ బలయ్ కార్యక్రమానికి అన్ని పార్టీల వారు రావటం సంతోషకరమని చెప్పారు ఆమె. తనకు బతుకమ్మ పండుగ చాలా బాగా నచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళలతో బతుకమ్మ ఆడటం చాలా సంతోషానికి గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు రాజ్భవన్లో బతుకమ్మ పండుగ నిర్వహించామని చెప్పారు.
రాష్ట్రాలు వేరైనా.. తమిళనాడు, తెలంగాణ సంప్రదాయాలు ఒక్కటేనని పేర్కొన్నారు గవర్నర్ తమిళ సై. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆమె తెలిపారు. అంతేకాదు ఒక డాక్టర్గా చెప్తున్నానని పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. తెలంగాణలో చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని పేర్కొన్న తమిళ సై పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. ఇటీవల న్యూస్ పేపర్ లో ఎక్కువమంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారని చదివానని, అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. బర్గర్లు పిజ్జాలకు నో చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళ సై.