కొందరికి తాను నచ్చకపోయినా.. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు!!
> కొందరికి తాను నచ్చకపోయినా, తనకు తెలంగాణా వాళ్ళంటే ఇష్టం అని, అందుకు ఎంత కష్టం అయినా పని చేస్తానని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ వేదికగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ పతాకవిష్కరణ చేసి సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్న తమిళి సై
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ఎందరో వీరుల త్యాగ ఫలితం మన దేశ స్వాతంత్రం అని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మన భారతదేశం అని ఆమె పేర్కొన్నారు. నిజమైన ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం దిక్సూచిగా ఉందని తమిళి సై వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆమె రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని, తెలంగాణ రాష్ట్రానికి ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ఎన్నో రంగాలలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్న తమిళిసై ఐటి మరియు వైద్యరంగంలో భాగ్యనగరం ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు.
తెలంగాణా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన తమిళి సై
దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ అనుసంధానమై ఉందని ఇటీవల తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలు కేటాయించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని పేర్కొన్న గవర్నర్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్న ఆమె కొందరికి తాను నచ్చకపోయినా తెలంగాణ వాళ్లు అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని జాతి నిర్మాణం అని తమిళిసై పేర్కొన్నారు.
కొందరికే ఫామ్ హౌస్ లు కాదు అందరికీ, ఫామ్ లు కావాలి
కష్టపడే తత్వం, నిజాయితీ, ప్రేమ తనకున్న పెద్దల బలమని, తనంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ తనకు తెలంగాణ వాళ్లు అంటే ఇష్టమని పేర్కొన్న గవర్నర్ తమిళి సై అందుకే ఎంత కష్టమైనా పని చేస్తానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కొందరికి ఫామ్హౌసులు కావాలని.. కొందరికే ఫామ్ హౌస్ లు కాదు అందరికీ, ఫామ్ లు కావాలని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు ఇస్తున్న ప్రధాన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన తమిళి సై రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎస్, డీజీపీ
రాజ్ భవన్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, డిజిపి అంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై అటు తెలంగాణా ప్రభుత్వానికి రాజ్ భవన్ కు మధ్య నెలకొన్న వివాదం నేపధ్యంలో తాజాగా గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.