విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాద్యత అన్న పవన్..! ఈటెల ఇంటి ముట్టడి..!కేసీఆర్ ఆగ్రహం..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకలకు పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఫీజు చెల్లింపు నుంచి ఫలితాల వెల్లడి వరకూ విద్యార్థుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ మరణాలపై స్పందించిన జనసేన..! ప్రభుత్వం బాద్యత వహించాలని డిమాండ్..!!
ఇదిలా ఉండగా విద్యార్థులపై అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడుతుండటాన్ని ఖండిస్తున్నామని పవన్ చెప్పారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని, నిజాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన తల్లిండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈటెల ఇంటికి పాకిన ఇంటర్ సెగ..! విద్యార్థుల భవితకు భరాసా ఇవ్వాలన్న విద్యార్థి సంఘాలు..!!
ఇంటర్ మీడియట్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, ఈ ఉదయం కరీంనగర్ లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో తరలివచ్చిన ఈటెల ఇంటి ముందు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు, ఈటల ఇంటివద్ద ఉన్న విద్యార్థులను చెదరగొట్టారు.
గందరగోళ పరిస్థితిపై సీయం ఆరా..! విచారణ వేగవతం చేయాలన్న సీఎం..!!
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణపై కూడా ఆయన ఆరా తీశారు. విచారణ ఎక్కడి వరకు వచ్చింది..? ప్రాథమికంగా ఏం తేలింది..? అనే విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఆలస్యంగానైనా చంద్రశేఖర్ రావు విద్యార్థుల పట్ల స్పందించారనే చర్చ జరుగుతోంది.
పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు..!క్లెవర్ స్టుండెంట్స్ కి సున్నా మార్కులేంటంటున్న పేరెంట్స్..!!
మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణపై కూడా ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణ ఎక్కడి వరకు వచ్చింది..? ప్రాథమికంగా ఏం తేలింది..? అనే విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మార్కుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడం కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.